శానిటైజర్లు తాగేస్తున్నారు | Alcohol Lovers Drinks Sanitizers in Karnataka Man Deceased | Sakshi
Sakshi News home page

శానిటైజర్లు తాగేస్తున్నారు

Apr 20 2020 7:47 AM | Updated on Apr 20 2020 7:47 AM

Alcohol Lovers Drinks Sanitizers in Karnataka Man Deceased - Sakshi

సాక్షి బెంగళూరు:  లాక్‌డౌన్‌ వల్ల మందు దొరక్క మద్యం ప్రియులు తల్లడిల్లిపోతున్నారు. కొంతమంది  మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. బ్లాక్‌లో  మందు దొరికినా కొని తాగేద్దామని సిద్ధం అవుతున్నారు. కానీ  మద్యం లభించకపోవడంతో  శానిటైజర్లను సేవిస్తున్నారు.హుబ్లీ–ధార్వాడ జిల్లాలో శానిటైజర్‌ తాగిన ఘటనలు జరిగాయి. నీటిలో ఈ శానిటైజర్లను కలుపుకుని తాగినట్లు తెలిసింది. హుబ్లీ జిల్లా, కలఘటికి తాలూకా గంబ్యాపుర  గ్రామానికి చెందిన  బసవరాజ్‌ వెంకప్ప కురివినకొప్ప (45) శానిటైజర్‌ తాగి మృతి చెందాడు.

కిడ్నీ, లివర్‌కు హాని..
 శానిటైజర్లను తాగడం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్లలో 70 శాతం ఆల్కహాలు ఉంటుంది. గ్లిసరిన్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అనే హానికర రసాయనాలు కూడా  ఉంటాయి. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వల్ల మూత్రపిండాలు, కాలేయం పాడయిపోతాయి. అయితే ఈ ప్రమాదకర శానిటైజర్లను అమ్మే ముందు అనుమతి తప్పనిసరి. కానీ కరోనా నియంత్రణకు శానిటైజర్లు అత్యవసరం కావడంతో ఎవరు అడిగినా విక్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా మద్యం ప్రియులు శానిటైజర్లు కొని మత్తులో మునిగిపోతున్నారు.   

విచ్చలవిడిగా అక్రమ మద్యం ..
రాష్ట్ర అబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం  మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 15 వరకు రాష్ట్రంలో 32 వేల లీటర్ల అక్రమ మద్యం సరఫరా అయినట్లు తెలిసింది. 22 వేల లీటర్ల బీర్లను అబ్కారీ శాఖ స్వాధీనం చేసుకుంది. 417 మందిని  అరెస్టుచేసింది.  అక్రమ మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కూడా తేలింది.  

Advertisement
 
Advertisement
Advertisement