బెంగళూరుపై యూపీ యోధ గెలుపు

UP Yoddha Beat Bengaluru Bulls In Final Home Match Of The Season - Sakshi

ముగిసిన ప్రొ కబడ్డీ లీగ్‌ దశ

14 నుంచి ప్లే ఆఫ్‌ పోరు

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో యూపీ యోధ 45–33తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగళూరు రైడర్‌ పవన్‌ షెరావత్‌ 13 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా... అతనికి సహచరుల నుంచి సహకారం అందలేదు. ఒక దశలో 5–14తో వెనుకంజలో ఉన్న యూపీని రైడర్‌ సురేందర్‌ గిల్‌ (9 పాయింట్లు), శ్రీకాంత్‌ జాదవ్‌ (9 పాయింట్లు) ఆదుకున్నారు. సూపర్‌ రైడ్‌తో 4 పాయింట్లు సాధించిన సురేందర్‌... బెంగళూరు ఆధిక్యాన్ని 14–9కి తగ్గించాడు.

తర్వాత కూడా యూపీ యోధ క్రమం తప్పకుండా పాయింట్లు సాధించి మొదటి అర్ధ భాగాన్ని 20–22తో ముగించింది. ఇక రెండో అర్ధ భాగంలో యూపీ డిఫెండర్‌ ఆశు సింగ్‌ (5 పాయింట్లు) ప్రత్యర్థి రైడర్లను పట్టేయడంతో ఆధిక్యంలోకెళ్లింది. ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించి విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో యూపీ యోధ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలువగా... బెంగళూరు బుల్స్‌ ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు దబంగ్‌ ఢిల్లీ–యు ముంబా మ్యాచ్‌ 37–37తో ‘టై’గా ముగిసింది.  

ప్లే ఆఫ్‌ షెడ్యూల్‌ (వేదిక: అహ్మదాబాద్‌)
అక్టోబర్‌ 14: ఎలిమినేటర్‌–1: యూపీ యోధ x బెంగళూరు బుల్స్‌
అక్టోబర్‌ 14: ఎలిమినేటర్‌–2: యు ముంబా xహరియాణా స్టీలర్స్‌
అక్టోబర్‌ 16: తొలి సెమీఫైనల్‌: దబంగ్‌ ఢిల్లీ xఎలిమినేటర్‌–1 విజేత
అక్టోబర్‌ 16: రెండో సెమీఫైనల్‌: బెంగళూరు బుల్స్‌ x ఎలిమినేటర్‌–2 విజేత
అక్టోబర్‌ 19: ఫైనల్‌ (సెమీఫైనల్స్‌ విజేతలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top