మా సంఘానికి ఐఓఏ గుర్తింపు ఉంది | We Have IOA Membership, OAT | Sakshi
Sakshi News home page

మా సంఘానికి ఐఓఏ గుర్తింపు ఉంది

Aug 15 2019 10:11 AM | Updated on Aug 15 2019 10:11 AM

We Have IOA Membership, OAT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకే హక్కు ఉందంటూ... మాదంటే మా సంఘానికే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గుర్తింపు ఉందంటూ గత కొంతకాలంగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (ఓఏటీ), తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (టీఓఏ) మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐఓఏ నియమించిన కమిటీ సభ్యుడైన నామ్‌దేవ్‌ షిర్గావోంకర్‌ ఆధ్వర్యంలో నిజాం కాలేజి వేదికగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ సమావేశం జరిగింది. ఓఏటీ అధ్యక్ష కార్యదర్శులైన ప్రొఫెసర్‌ కె. రంగారావు, పి. ప్రకాశ్‌ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓఏటీ ఏర్పాటు జరిగిన విధానాన్ని నామ్‌దేవ్‌కు వివరించారు.  ఐఓఏ నార్మ్, సొసైటీస్‌ యాక్ట్‌ చట్టాలకు అనుగుణంగా ఐఓఏ పరిధిలోనే 2015లో చట్టబద్ధంగా తమ సంఘాన్ని ఏర్పాటు చేశామని రంగారావు తెలిపారు. ఐఓఏ పరిధిలోనే తాము క్రీడా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఓఏటీకి చట్టబద్ధత ఉందని అన్నారు.

మరోవైపు ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీఓఏ అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి తమ వైపు వాదనలను ఐఓఏ సభ్యుడు నామ్‌దేవ్‌కు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నామ్‌దేవ్‌ ఈ విషయాన్ని ఐఓఏ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ వివాదం పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఏటీ సభ్యులైన అబ్బాస్‌ కీర్మాణి, ఎస్‌ఆర్‌ ప్రేమ్‌రాజ్, పాణిరావు, మహేశ్‌ కుమార్, ఫల్గుణ, అశోక్‌ కుమార్, శ్రీశైలం, దీక్షిత్, లక్ష్మీకాంతం.... టీఓఏ ప్రతినిధులు కె. జగదీశ్వర్‌ యాదవ్,  తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement