శివాని, సాత్విక ముందంజ | Sakshi
Sakshi News home page

శివాని, సాత్విక ముందంజ

Published Thu, Oct 4 2018 10:02 AM

Shivani, Satwika in Fenesta Open 3rd Round - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సామ సాత్విక, శ్రావ్య శివాని, షేక్‌ హుమేరా ముందంజ వేశారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో వీరు మూడో రౌండ్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల రెండో రౌండ్‌లో సాత్విక 6–1, 6–1తో రిషిక సుంకర (ఢిల్లీ)పై, శ్రావ్య శివాని 6–2, 6–3తో నిత్యరాజ్‌ బాబురాజ్‌ (తమిళనాడు)పై విజయం సాధించారు. హుమేరా 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి ముస్కాన్‌ గుప్తా (ఢిల్లీ) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో ఆమె ముందంజ వేసింది. పురుషుల విభాగంలో తెలంగాణకు చెందిన సీపీ అనిరుధ్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

అండర్‌–18 బాలికల విభాగంలోనూ షేక్‌ హుమేరా, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండోరౌండ్‌లో హుమేరా 3–6, 6–4, 6–3తో ముస్కాన్‌ గుప్తా (ఢిల్లీ)పై గెలుపొందగా, రష్మిక 6–2, 6–3తో విపాసా మెహ్రా (తమిళనాడు)ను ఓడించింది. బాలుర విభాగంలో రాష్ట్రానికి చెందిన గంటా సాయికార్తీక్‌ రెడ్డి 5–7, 6–4, 4–7 (4/7)తో అజయ్‌ మలిక్‌ (హరియాణా) చేతిలో పరాజయం పాలై రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.

Advertisement
Advertisement