సైనా, సింధు క్వార్టర్స్‌కు... | Saina Nehwal, PV Sindhu sail into quarters | Sakshi
Sakshi News home page

సైనా, సింధు క్వార్టర్స్‌కు...

Aug 3 2018 1:36 AM | Updated on Aug 3 2018 1:36 AM

Saina Nehwal, PV Sindhu sail into quarters - Sakshi

నాన్‌జింగ్‌ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ దూసుకెళ్తున్నారు. పతకం వేటలో ఉన్న వీళ్లిద్దరు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని–సాత్విక్‌ జోడీ కూడా క్వార్టర్స్‌ చేరింది. అయితే పురుషుల సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాయిప్రణీత్‌ ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్‌ ఆట ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది.  

రచనోక్‌కు సైనా చెక్‌... 
ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఓ సారి రజతం (2015), మరో సారి కాంస్యం (2017) సాధించిన భారత వెటరన్‌ షట్లర్, పదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ మాజీ చాంపియన్‌ రచనోక్‌ ఇంతనోన్‌ (థాయ్‌లాండ్‌)ను వరుస గేముల్లో కంగుతినిపించింది. మహిళల సింగిల్స్‌  ప్రిక్వార్టర్స్‌లో ఆమె 21–16, 21–19తో రచనోక్‌ను ఇంటిదారి పట్టించింది. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 21–10, 21–18తో 9వ సీడ్‌ సంగ్‌ జి హ్యూన్‌ (కొరియా)పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో సైనా... ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో, సింధు... 8వ సీడ్‌ నొజొమి ఒకుహర (జపాన్‌)తో తలపడతారు.  

శ్రీకాంత్‌ కథ ముగిసె... 
పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ ప్లేయర్, ఐదో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మలేసియా అన్‌సీడెడ్‌ ఆటగాడు డారెన్‌ ల్యూ 21–18, 21–18తో వరుస గేముల్లో శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ 21–13, 21–11తో హన్స్‌ క్రిస్టియాన్‌ సోల్బెర్గ్‌ (డెన్మార్క్‌)పై అలవోక విజయం సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ 20–22, 21–14, 21–6తో ఏడో సీడ్‌ గొ సూన్‌ హూత్‌ – షెవొన్‌ జెమీ లాయ్‌ (మలేసియా) జంటపై గెలిచింది. క్వార్టర్స్‌లో ప్రణీత్‌కు కెంటో మొమొట (జపాన్‌) రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవగా, అశ్విని–సాత్విక్‌ జంట... టాప్‌ సీడ్‌ జెంగ్‌ సివే– హుయంగ్‌ యకిఒంగ్‌ (చైనా) ద్వయాన్ని ఎదుర్కొంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement