
రిషబ్ పాంట్ సరికొత్త రికార్డు
అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ ఓపెనర్ రిషబ్ పాంట్ దుమ్మురేపాడు.
మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి టోర్నీలో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. పంత్ (24 బంతుల్లో 78; 9 ఫోర్లు; 5 సిక్సర్లు) మెరుపులకు తోడు కెప్టెన్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) ఫామ్లోకి రావడంతో సోమవారం నేపాల్తో జరిగిన వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది కుర్రాళ్లకు వరుసగా మూడో విజయం కాగా ఊహించని జోరుతో ముందుకు సాగుతున్న నేపాల్కు తొలి పరాజయం. ఈ విజయంతో గ్రూప్ ‘డి’లో భారత్ అగ్రస్థానం పొందింది. ఈరెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్ చేరాయి.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నేపాల్ 48 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి నేపాల్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అవేశ్ ఖాన్ మూడు... దాగర్, సుందర్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యమే అయినా భారత్ వేగంగా ఆడి 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 175 పరుగులు చేసి గెలిచింది. ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచిన రిషబ్ ప్రతీ బంతిని బాదుతూ తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. ఆకాశమే హద్దుగా చేలరేగిన తను రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో రికార్డు అర్ధ సెంచరీని అందుకున్నాడు. అటు ఇషాన్ కూడా తొలిసారి జోరును కనబరిచి 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
తొమ్మిదో ఓవర్లో వరుసగా 6,4,6,6 బాదిన రిషబ్ మరుసటి ఓవర్లోనే బౌల్డ్ అవడంతో తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అప్పటికే 55 బంతుల్లో తొలి వికెట్కు 124 పరుగులు వచ్చాయి. చివర్లో సర్ఫరాజ్ (23 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్), అర్మాన్ (13 బంతుల్లో 18 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. మిగతా మ్యా చ్ల్లో అఫ్ఘాన్ నాలుగు వికెట్ల తేడాతో కెనడాపై... న్యూజి లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఐర్లాండ్పై నెగ్గాయి.