ముంబై ఇండియన్స్‌ సరిగ్గా ఇదే రోజు

OnThis Day IPL Title for Mumbai Indians Won the Final Against Pune - Sakshi

హైదరాబాద్‌ : ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఉత్కంఠ పోరులో అనూహ్య విజయన్నందుకొని టైటిల్‌ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్‌. స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని అప్పటి జట్టు రైజింగ్‌ పుణె ఆఖరి వరకు పోరాడి చేతులెత్తేసింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్‌ డ్రామాను తలిపించింది. తక్కువ స్కోర్ల మ్యాచే అయినా ఐపీఎల్‌ ఫైనల్‌ అంటే ఎంత ఉత్కంఠగా సాగాలో అలాగే  సాగింది. అనూహ్య రీతిలో మలుపులు తిరిగి ఆటను చివరి క్షణం వరకు రక్తి కట్టించింది. ఈ అద్భుత పోరులో చివరకు ముంబై అనుభవం గెలిచింది. ఒకే ఒక్క పరుగుతో ఆ జట్టు మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది.

పుణె విజయాన్ని లాగేసిన జాన్సన్‌..
ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరం. తొలి బంతిని మనోజ్‌ తివారీ చక్కటి ఫోర్‌గా మలిచాడు. అయితే తర్వాతి రెండు బంతుల్లో తివారీ, స్మిత్‌లను అవుట్‌ చేసిన జాన్సన్‌ మ్యాచ్‌ను ముంబై చేతుల్లోకి తెచ్చాడు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేసినా పుణేకు ఓటమి తప్పలేదు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, మూడో పరుగు తీసే ప్రయత్నంలో సుచిత్‌ త్రోకు క్రిస్టియాన్‌ అవుటయ్యాడు. దీంతో ముంబై విజయం సాధించింది.

కొంప ముంచిన అతి జాగ్రత్త..
రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌... అతి జాగ్రత్త జట్టు కొంప ముంచింది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే పరిమితం చేయగలిగినా... టీ20 తరహా దూకుడు ఎక్కడా చూపించకుండా ఒత్తిడి పెంచుకుంది. 20 ఓవర్లలో ఏ దశలోనూ జట్టు రన్‌రేట్‌ కనీసం 7 పరుగులు దాటలేదు. చివరి వరకు నిలిచి విజయం వైపు నడిపించగలడని నమ్మిన స్టీవ్‌ స్మిత్‌ చేతులెత్తేశాడు. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (22 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పుణే సూపర్‌ జెయింట్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. అద్భుత ప్రదర్శన కనబర్చిన కృనాల్‌ పాండ్యాకు మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ అవార్డు లభించింది.

ఈ సీజన్‌లో నిరాశపరిచిన రోహిత్‌ సేన
మేటి ఆటగాళ్లతో.. ఢిఫెండింగ్‌ చాంపియన్‌గా ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్‌లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కూడా కనబర్చలేకపోయింది. టోర్నీ ఆరంభంలోనే వరుస ఓటములను మూటగట్టుకున్న ముంబై అనూహ్యంగా విజృంభించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. ముంబై నెలకు కొట్టిన బంతిలా పుంజుకుంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసి లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top