సెమీస్‌లో  ముంబై రాకెట్స్‌

Mumbai Rockets qualify for semifinals  - Sakshi

అహ్మదాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌లో ముంబై రాకెట్స్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐదు జట్లతో తలపడిన ముంబై మూడింటిపై గెలిచి 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో ముంబై 5–0తో చెన్నై స్మాషర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఆటగాడు ఆండెర్స్‌ ఆంటోన్‌సెన్‌ 15–14, 15–11తో రాజీవ్‌ ఒసెఫ్‌పై గెలిచాడు. చెన్నై ‘ట్రంప్‌’మ్యాచ్‌ అయిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ కిమ్‌ జీ జాంగ్‌–బెర్నాడ్త్‌ (ముంబై) జంట 15–14, 15–14తో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రియల్‌ అడ్‌కాక్‌ జోడీపై గెలవడంతో ముంబై 2–(–1)తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహిళల సింగిల్స్‌లో చెన్నై ప్లేయర్‌ సుంగ్‌ జీ హ్యూన్‌ 15–7, 15–8తో అనురా ప్రభుదేశాయ్‌పై నెగ్గింది. ముంబై ‘ట్రంప్‌’అయిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 12–15, 15–13, 15–9తో పారుపల్లి కశ్యప్‌పై గెలిచి 4–0తో విజయాన్ని ఖాయం చేశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో కిమ్‌ జీ జాంగ్‌–లీ యాంగ్‌ డై జోడీ 15–8, 15–10తో ఆర్‌ చిన్‌ చుంగ్‌–సుమీత్‌ రెడ్డి ద్వయంపై గెలిచి 5–0తో ముగించింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌ 4–3తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌పై గెలిచింది. నేడు ఢిల్లీ డాషర్స్‌తో పుణే సెవెన్‌ ఏసెస్, అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌తో తలపడతాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top