
గువాహటి: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వయసు పెరుగుతున్నా ఇంకా అతను మాత్రం ఫీల్డ్ లోకదిలే తీరు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తాను 'వైన్' లాంటివాడినని గతంలో పేర్కొన్న ధోని.. ఆ మాటకు సార్ధకత చేకూరుస్తూ అన్ని విభాగాల్లో రాణిస్తున్నాడు. అటు మ్యాచ్ ఫినిషింగ్, ఇటు కీపింగ్ తో పాటు పరుగులు తీయడంలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. దీనిలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇటీవల గువహటిలో ముగిసిన రెండో వన్డేలో ధోనీ వికెట్ల మధ్య పరుగు వేగాన్ని విశ్లేషిస్తూ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను విడుదల చేసింది. 2019 వరల్డ్ కప్ కు ధోని ఫిట్ నెస్ సరిపోదు అనేవారికి ఇదొక సమాధానమనే చెప్పాలి.
గువాహటిలో ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో ధోని బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బంతిని కొట్టాడు. దానికి పరుగుతీసే క్రమంలో గంటకి 30కి.మీ మొదలుపెట్టి 31కి.మీ రెండో పరుగును పూర్తి చేశాడు. కేవలం పరుగు రావడమే కష్టమనుకున్న తరుణంలో ధోని రెండు పరుగులు తీయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, మరో ఎండ్ లో ఉన్న కేదర్ జాదవ్ మాత్రం ధోని వేగాన్ని అందుకోలేక ఆపసోపాలు పడ్డాడు. ధోని వేగంలో జాదవ్ సగం వేగాన్ని మాత్రమే అందుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని వేగాన్ని అందుకోవడం సాధ్యమా అంటూ నెటిజన్లు అభినందనులు కురిపిస్తున్నారు.