ట్రోలింగ్‌కు మిథాలీ సూపర్‌ కౌంటర్‌! | Mithali Raj Hits Twitter Troll With Perfect Response | Sakshi
Sakshi News home page

Aug 17 2018 10:28 AM | Updated on Aug 17 2018 4:28 PM

Mithali Raj Hits Twitter Troll With Perfect Response - Sakshi

మిథాలీ రాజ్‌

బెంగళూరు: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇండిపెండెన్స్‌ డే విషెస్‌ ఒకరోజు ఆలస్యంగా చెప్పడంతో ఓ నెటిజన్‌ ఆమెను నిలదీశాడు. దీనికి కారణం చెబుతూ మిథాలీ సూపర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మిథాలీకి అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. 

టీ20 మహిళా చాలెంజర్స్‌ ట్రోర్నీలో బిజీగా ఉన్న మిథాలీ ఒక రోజు ఆలస్యంగా ఇండిపెండెన్స్‌ విషెస్‌ తెలియజేస్తూ.. ’ఎందరో వీరులు త్యాగం చేసి.. ఆకలి, పేదరికం, వివక్ష, సెక్సిజం, చీత్కారాల నుంచి మనల్ని కాపాడారు. మనల్ని మనంగా నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. స్వేచ్చగా జీవించేలా చేశారు. వారి త్యాగాలను ఓ సారి స్మరించుకుంటూ వారందరికీ గౌరవ వందనం చేద్దాం. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఓ నెటిజన్‌ ’ఇండిపెండెన్స్‌ డే ముగిసింది మేడమ్‌.. ఓ సెలబ్రిటీగా మీకిది తగదు’ అని బదులిచ్చాడు. ఈ ట్వీట్‌ను మిథాలీ అదేరీతిలో తిప్పికొట్టారు. 

'నాకు సెలబ్రిటీ హోదా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 1999 నుంచి నేను క్రీడాకారిణిగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం నేను చాలెంజర్స్‌ ట్రోఫీలో ఆడుతున్నాను. మైదానంలో ఉన్నంతసేపు మా వద్ద ఫోన్‌ ఉండదు. మ్యాచ్‌ జరిగే సమయంలో నేను ఫోన్‌ ఉపయోగించను. అందుకే ఆలస్యమైంది. నా ఈ కారణాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అని మిథాలీ వివరణ ఇచ్చారు. ఈ వివరణపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement