‘అప్పుడే కోహ్లీ సత్తా ఏంటో తెలుస్తుంది’ | Kohli will become greatest captain while he do well in overseas, says Ganguly | Sakshi
Sakshi News home page

‘అప్పుడే కోహ్లీ సత్తా ఏంటో తెలుస్తుంది’

Dec 7 2017 2:14 PM | Updated on Dec 7 2017 2:14 PM

Kohli will become greatest captain while he do well in overseas, says Ganguly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌ల విజయాలు అందించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రికార్డును తాజాగా భారత కెప్టెన్‌ విరాట్ కొహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ వ్యక్తిగత రికార్డులతో పాటు కెప్టెన్‌గా సాధిస్తోన్న ఘనతలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. కోహ్లీ వరుసగా తొమ్మిది టెస్ట్ సిరస్‌ విజయాలు అందించినా.. వాటిలో ఎక్కువ సిరీస్‌ విజయాలు భారత్‌లోనే వచ్చాయన్నాడు. విదేశీ గడ్డపై విజయాలు అందిస్తేనే కెప్టెన్‌గా కోహ్లీ సత్తా బయట పడుతుందని అభిప్రాయపడ్డాడు.

’లంకతో సిరస్‌ ముగిశాక దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ ఆడనుంది. అక్కడ కూడా ఇదే స్థాయిలో విజయాలు సాధిస్తే కోహ్లీ దిగ్గజ కెప్టెన్‌ అవుతాడనడంలో సందేహం అక్కర్లేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో ఆ దేశాలపై సిరీస్‌లు నెగ్గితే కోహ్లీ స్థాయి మరింత పెరుగుతుంది. 9 టెస్ట్ సిరీస్ విజయాల్లో శ్రీలంక, వెస్టిండీస్‌ దేశాల్లోనే భారత్ విజయాలు సాధించింది. 80 శాతానికి పైగా విజయాలు స్వదేశంలోనే వచ్చాయి. కనుక ఇక విదేశీగడ్డపై కూడా కోహ్లీ రాణించాలని ఆశిద్దాం. విదేశాల్లోనూ సిరీస్‌లు నెగ్గితే దిగ్గజ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ చేరిపోతాడని’  సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.

శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1 - 0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా కొహ్లీకి ఇది వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్‌ విజయం. 2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్‌లలో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఇంగ్లండ్‌ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్‌లలో విజయాలు సాధించింది. 2015లో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్‌ కొహ్లీ తొలి టెస్టు సిరీస్‌ను శ్రీలంకపైనే నెగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement