
ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో భాగంగా చివరి టెస్టులో ఐదు వికెట్లతో సత్తాచాటిన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. దేశవాళీ మ్యాచ్ల్లో భాగంగాడ్రెస్సింగ్ రూమ్లోని గోడకు పంచ్ ఇచ్చి గాయం బారిన పడ్డాడు. షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు సారథిగా వ్యహరించిన మిచెల్ మార్ష్.. పెర్త్లో తస్మానియాతో జరిగిన మ్యాచ్ తర్వాత నిరాశకు గురయ్యాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగియడంతో కలత చెందిన మార్ష్ తన చేతిలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న గోడను గట్టిగా కొట్టాడు. అనంతరం గాయంతో విలవిల్లాడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే అతని చేతికి పలు స్కానింగ్లు చేసిన తర్వాత అతనికి మధ్య వేలు చిట్టినట్లు వైద్యులు తేల్చారు. దాంతో ఆరు వారాల విశ్రాంతి అనివార్యమైంది. అదే సమయంలో పాకిస్తాన్తో జరుగనున్న టెస్టు సిరీస్కు సైతం మార్ష్ దూరమయ్యాడు.
తరచు గాయాల బారిని సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతూ వస్తున్న మిచెల్ మార్ష్.. ఈసారి తన స్వీయ తప్పిదంతో సిరీస్లకు దూరం కావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఎంపిక చేయబోయే జాబితాలో ఆల్ రౌండర్ కోటాలో ప్రధానంగా మార్ష్ పేరు వినిపించినా, అతను చేతికి చేసుకున్న గాయంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
దీనిపై మార్ష్ మాట్లాడుతూ.. ‘ ఇదొక దురదృష్టకరమైన ఘటన. ఇది మళ్లీ జరగదు. ఈ గాయం నాకు ఒక గుణపాఠం నేర్పింది. మిగతావారికి కూడా ఇదొక పాఠమే అనుకుంటున్నా. నేను చేసుకున్న తప్పిదంతో మణికట్టు వద్ద చిట్లింది. నా మధ్య వేలి కింది భాగంలో పగులు వచ్చింది. మనం కొన్ని సందర్భాల్లో గెలుస్తాం. ఔట్లు కూడా అవుతాం. కానీ గోడకు పంచ్లు ఇవ్వొదు. నేను 18 నెలల నుంచి జాతీయ జట్టులో రాకకోసం యత్నిస్తున్నా. అలానే యాషెస్ సిరీస్లో అవకాశం వచ్చింది.. ఉపయోగించుకున్నా. కానీ నా తప్పిదం ఇప్పుడు నన్ను జట్టుకు దూరం చేసింది. మా కోచ్(ఆసీస్) జస్టిన్ లాంగర్ నన్ను ఒక ఇడియట్ అన్నారు. నేను ఇలా గాయం చేసుకోవడంతో లాంగర్ చాలా నిరుత్సాహ పడ్డారు. ఇందుకు నేను క్షమాపణలు చెప్పడం తప్ప చేసేదేమీ లేకపోయింది’ అని మార్ష్ వివరించాడు.