కంగారెత్తించాం...

India Beat Australia By Seven Wickets In Third ODI - Sakshi

రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీ

కోహ్లి సాధికారిక ఇన్నింగ్స్‌

బంతితో మెరిసిన షమీ

మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం

సిరీస్‌ 2–1తో సొంతం

స్మిత్‌ సెంచరీ వృథా

కీలక మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ సెంచరీ వరమైతే... ఈ సీజన్‌లో మరో సిరీస్‌ భారత్‌ సొంతమైంది. ఈ ఏడాది శ్రీలంకపై పొట్టి సిరీస్‌ను... ఆసీస్‌పై వన్డే సిరీస్‌ను భారత్‌ చేజిక్కించుకుని ‘విజన్‌–2020’ని గొప్పగా ప్రారంభించింది. ప్రత్యర్థి ఓపెనర్లను తేలిగ్గానే ఔట్‌ చేసినా... స్మిత్‌ శతకం టీమిండియాను ఇబ్బంది పెట్టింది. ఛేదనలో మొనగాడు కోహ్లితో రోహిత్‌ భాగస్వామ్యం భారత్‌ను విజయం దిశగా నడిపించింది.

బెంగళూరు: నిర్ణాయక పోరులో భారత బౌలింగ్, బ్యాటింగ్‌ ప్రత్యర్దిని ‘కంగారు’ పెట్టించాయి. రోహిత్‌ శర్మ (128 బంతుల్లో 119; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం, కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి (91 బంతుల్లో 89; 8 ఫోర్లు) అర్ధశతకం భారత్‌ను గెలిపించింది. ఆఖరి పోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (132 బంతుల్లో 131; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించగా, లబ్‌షేన్‌ (64 బంతుల్లో 54; 5 ఫోర్లు) రాణించాడు. భారత పేసర్‌ షమీ 4 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 47.3  ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.  

రాహుల్‌ విఫలమైనా...
ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యం చిన్నదేమీ కాదు! కానీ రెగ్యులర్‌ ఓపెనర్‌ ధావన్‌ భుజం గాయంతో ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు దూరం కాగా... సుస్థిర స్థానం సంపాదించుకున్న రాహుల్‌ (27 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఎందుకనో ఓపెనింగ్‌లో సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ భారత్‌కు 69 పరుగుల మోస్తరు ఆరంభమైతే లభించింది. స్పిన్నర్‌ అగర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పీల్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించగా... ఆసీస్‌ రివ్యూకెళ్లి వికెట్‌ను దక్కించుకుంది.  

సూపర్‌ ‘హిట్‌’మ్యాన్‌...

అనంతరం సారథి కోహ్లి క్రీజ్‌లోకి రాగా... అతని అండతో రోహిత్‌ శర్మ పరుగులు బాదడంపై శ్రద్ధపెట్టాడు. కుదిరిన బంతిని బౌండరీకి, చెదిరిన బంతిని సిక్సర్‌గా తరలించాడు. అలా 56 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. కోహ్లి–రోహిత్‌ జోడీ క్రీజ్‌లో పాతుకుపోవడంతో జట్టు స్కోరు 21వ ఓవర్లో వంద పరుగులకు చేరింది. స్పిన్నర్లను రోహిత్‌ చక్కగా ఎదుర్కొన్నాడు. జంపా, లబ్‌õÙన్, అగర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. కెప్టెన్‌ ఫించ్‌ స్వయంగా బౌలింగ్‌కు దిగగా అతనికి తన సిక్స్‌ రుచిచూపించాడు. ఇదే క్రమంలో 110 బంతుల్లో (8 ఫోర్లు, 5 సిక్సర్లు) రోహిత్‌ శతకం పూర్తయింది. వన్డేల్లో అతనికిది 29వ సెంచరీ. మరోవైపు భారీ షాట్లు బాదకపోయిన కోహ్లి 61 బంతుల్లో (4 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 36వ ఓవర్లోనే 200కు చేరింది. ఎట్టకేలకు జంపా... రోహిత్‌ను ఔట్‌ చేయడంతో 137 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కెపె్టన్‌కు జతయిన శ్రేయస్‌ (35 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. దీంతో సెంచరీకి చేరువైన కోహ్లి షాట్లు కొట్టే ప్రయత్నంలో ఔటయినా అప్పటికే భారత్‌ విజయ తీరానికి చేరుకుంది.

ఆరంభం తడబడింది...
అంతకుముందు టాస్‌ నెగ్గిన ఆ్రస్టేలియా ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకే మొగ్గుచూపింది. కానీ ఇన్నింగ్స్‌ తడబడుతూ మొదలైంది. ఒక దశలో అయితే ఆస్ట్రేలియా ఆరంభం చెదిరింది. సీనియర్‌ పేసర్‌ షమీ... వార్నర్‌ (3)ను ఔట్‌ చేయడంతో 18 పరుగులకే డాషింగ్‌ వికెట్‌ పడింది. తర్వాత కెపె్టన్‌ ఫించ్‌ (19; 1 ఫోర్, 1 సిక్స్‌)కు స్మిత్‌ జతయ్యాడు. ఇద్దరి భాగస్వామ్యం కుదుటపడేలోపే రనౌట్‌ రూపంలో ఫించ్‌ వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 46 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. టాస్‌ గెలవగానే కెపె్టన్‌ ఫించ్‌ తలచిందొకటి... బరిలోకి దిగగానే ఆరంభంలో జరిగిందొకటిగా కంగారూ ఇన్నింగ్స్‌ తయారైంది.

స్మిత్‌ నిలబెట్టాడు...

పరిస్థితిని అర్థం చేసుకున్న స్మిత్, లబ్‌õÙన్‌తో కలిసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అనవసర షాట్లకు వెళ్లకుండా సమన్వయంతో పరుగులు కూడబెట్టాడు. గతి తప్పిన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకున్నాడు. దీంతో 8.5 ఓవర్లో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌ మరో 21.4 ఓవర్లదాకా వికెట్‌ను చేజార్చుకోలేదు. ఈలోపే 18వ ఓవర్లోనే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. స్మిత్‌ 63 బంతుల్లో (8 ఫోర్లు), లబ్‌õÙన్‌ 60 బంతుల్లో (5 ఫోర్లు) అర్ధసెంచరీల్ని అధిగమించారు. భారత్‌కు ముప్పుతెచ్చేలా సాగిపోతున్న ఈ జోడీని జడేజా విడగొట్టాడు. 32వ ఓవర్‌లో కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి అద్భుత క్యాచ్‌కు లబ్‌õÙన్‌ ఆట ముగిసింది. దాంతో 127 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్‌ ఆఖరి బంతికి జడేజా... స్టార్క్‌ (0)ను డకౌట్‌ చేశాడు. తర్వాత క్యారీ (36 బంతుల్లో 35; 6 ఫోర్లు) అండతో జట్టు స్కోరును 200 పరుగులకు చేర్చిన స్మిత్‌ 117 బంతుల్లో (11 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అతనితో పాటు టెయిలెండర్లు కమిన్స్‌ (0), జంపా (1)లను షమీ పెవిలియన్‌ చేర్చాడు.

ధావన్‌కు గాయం

గత ఏడాది గాయాలతోనే సతమతమైన భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తాజాగా మళ్లీ గాయపడ్డాడు. ఆఖరి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే మైదానం నుంచి నిష్క్రమించాడు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ వెంటనే ఎక్స్‌రే తీయించింది. బ్యాటింగ్‌ చేసేందుకు కూడా అతను బరిలోకి దిగలేదు. దీంతో రోహిత్‌కు జతగా రాహుల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ధావన్‌ ఎంపికయ్యాడు. అయితే ధావన్‌ ఎక్స్‌రే నివేదిక చూశాకే అతను కివీస్‌తో సిరీస్‌లో పాల్గొనేది లేనిది తెలుస్తుంది. న్యూజిలాండ్‌ పర్యటన కోసం సోమవారం భారత జట్టు బయలుదేరనుంది.   

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 3; ఫించ్‌ (రనౌట్‌) 19; స్మిత్‌ (సి) అయ్యర్‌ (బి) షమీ 131; లబ్‌షేన్ (సి) కోహ్లి (బి) జడేజా 54; స్టార్క్‌ (సి) చహల్‌ (సబ్‌) (బి) జడేజా 0; క్యారీ (సి) అయ్యర్‌ (బి) కుల్దీప్‌ 35; టర్నర్‌ (సి) రాహుల్‌ (బి) సైనీ 4; అగర్‌ (నాటౌట్‌) 11; కమిన్స్‌ (బి) షమీ 0; జంపా (బి) షమీ 1; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 286.
వికెట్ల పతనం: 1–18, 2–46, 3–173, 4–173, 5–231, 6–238, 7–273, 8–276, 9–282.
బౌలింగ్‌: బుమ్రా 10–0–38–0, షమీ 10–0–63–4, సైనీ 10–0–65–1, కుల్దీప్‌ యాదవ్‌ 10–0–62–1, రవీంద్ర జడేజా 10–1–44–2.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) స్టార్క్‌ (బి) జంపా 119; రాహుల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్‌ 19;  విరాట్‌ కోహ్లి (బి) హాజల్‌వుడ్‌ 89; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 44; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 289.
వికెట్ల పతనం: 1–69, 2–206, 3–274.
బౌలింగ్‌: కమిన్స్‌ 7–0–64–0, స్టార్క్‌ 9–0–66–0, హాజల్‌వుడ్‌ 9.3–1–55–1, అగర్‌ 10–0–38–1, జంపా 10–0–44–1, లబ్‌షేన్‌ 1–0–11–0, ఫించ్‌ 1–0–9–0.   

ఏ విధంగా చూసినా... గతేడాది భారత్‌లో పర్యటించిన జట్టు కంటే ఇప్పటి ఆసీస్‌ జట్టే పటిష్టంగా ఉంది. స్మిత్, వార్నర్‌ నిషేధంలో ఉండగా...  లబ్‌షేన్ (వన్డేల్లో) అరంగేట్రం చేయలేదు. ఇప్పుడు వీళ్లంతా ఫామ్‌లో ఉన్నా కూడా వారిపై సిరీస్‌ గెలవడం చాలా సంతృపినిచింది. 2020లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ను విజయాలతో ఆరంభించాం.
–భారత కెప్టెన్‌ కోహ్లి  

►7 భారత్‌ తరఫున వన్డేల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.  

►4 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో సనత్‌ జయసూర్య (28 సెంచరీలు)ను ఐదో స్థానానికి నెట్టేసి రోహిత్‌ శర్మ (29 సెంచరీలు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. సచిన్‌ (49), కోహ్లి (43), రికీ పాంటింగ్‌ (30) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.  

►3 వన్డేల్లో అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు పొందిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. సచిన్‌ (14), జయసూర్య (11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 8 అవార్డులతో గేల్, షాన్‌ పొలాక్‌ సరసన సంయుక్తంగా మూడో స్థానంలో కోహ్లి ఉన్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top