ప్రపంచకప్‌ ఫైనల్‌ క్రెడిట్‌ ఎవరికి?.. రైనా క్లారిటీ! | ICC World Cup 2011: Raina Says Gambhir Kohli Partnership Turning Point In Final | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ ఫైనల్‌ క్రెడిట్‌ ఎవరికి?.. రైనా క్లారిటీ!

Apr 3 2020 8:44 PM | Updated on Apr 3 2020 8:44 PM

ICC World Cup 2011: Raina Says Gambhir Kohli Partnership Turning Point In Final - Sakshi

ఎంఎస్‌ ధోని సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే వన్డే ప్రపంచకప్‌ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుంది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎంఎస్‌ ధోని, గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌, జహీర్‌ ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లలో ప్రపంచకప్‌ గెలవడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు. దీనికి సమాధానం కష్టం ఎందుకుంటే ప్రతీ మ్యాచ్‌లో ఒక్కరే జట్టును గెలిపించలేదు. దీంతో ఫైనల్‌ వరకు క్రెడిట్‌ అందరి ప్లేయర్స్‌కు దక్కింది. అయితే ఫైనల్‌ గెలుపు మాత్రం ఒక్కరికే ఆపాదించడం కొందరికి నచ్చడం లేదు. దీనిపై గౌతమ్‌ గంభీర్‌ బహిరంగంగానే విమర్శలకు దిగాడు. తాజాగా ఫైనల్‌ గెలుపుపై టీమిండియా సీనియర్‌ ఆటగాడు,  ఫ్యామిలీ మ్యాన్‌ సురేశ్‌ రైనా స్పందించాడు.

‘చిన్నప్పడు బ్యాట్‌ పట్టినప్పుడే అనుకున్నా ప్రపంచకప్‌ గెలిచే భారత జట్టులో సభ్యుడిగా ఉండాలని. ఆ కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ తాలూకు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఫైనల్‌ వరకు మా ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో ఛేదనలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. అయితే ఈ క్రమంలో గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి జోడి మూడో వికెట్‌కు 83 పరుగులు నమోదుచేసి విజయానికి గట్టి పునాది వేశారు. నా దృష్టిలో టీమిండియా ప్రపంచకప్‌ ఫైనల్లో గెలవడంలో ఇదే టర్నింగ్‌ పాయింటని భావిస్తాను. ఒత్తిడిలోనూ వారిద్దరూ బాధ్యతాయుతంగా ఆడిన తీరు అద్భుతం.

అయితే విరాట్‌ కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్‌ రావాల్సింది కానీ ఇద్దరు లెప్టాండర్స్‌ అవుతుండటం, ముత్తయ్య మురళీధరన్‌ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో సమర్థవంతంగా ఆడిన అనుభవం ఉండటంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఫైనల్‌ వంటి పోరులో మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. అయితే వికెట్లు పడకుండా, స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ధోని, గంభీర్‌లు చాలా బాగా ఆడారు. అయితే సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్‌ వెనుదిరగడం నిరుత్సాహపరిచింది. యువరాజ్‌తో కలిసి ధోని టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే గంభీర్‌-కోహ్లిలు మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేయకుంటే టీమిండియా విజయం అంత సులభం అయ్యేది కాదని నా భావన’ అంటూ రైనా పేర్కొన్నాడు. 

చదవండి:
ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్‌ కప్‌ గెలవలేదు!
వెస్టిండీస్‌ మురిసే.. స్టోక్స్‌ ఏడిచే
ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement