
ఆకట్టుకునేదెవరో...!
కటక్: వెస్టిండీస్తో సిరీస్ అర్ధంతరంగా రద్దు కావడంతో టీమిండియా ప్రపంచకప్ సన్నాహకాలకు కాస్త ఇబ్బంది తలెత్తినా... బీసీసీఐ యుద్ధ ప్రతిపాదికన లంకతో....
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్కు మరో నాలుగు నెలల సమయమే ఉంది. ఇందులో ఆడే సత్తా తమలో ఉందని నిరూపించుకోవడానికి భారత్, శ్రీలంక జట్లలోని యువ క్రికెటర్లు తహతహలాడుతున్నారు. అవకాశం దొరికితే తమని తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలోని యువ క్రికెటర్లకు తమ సత్తా చూపేందుకు మంచి అవకాశం లభించింది. నేటి నుంచి ఇరు జట్ల మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్ ద్వారా సెలక్టర్లను ఆకట్టుకునేదెవరో తేలిపోతుంది.
కటక్: వెస్టిండీస్తో సిరీస్ అర్ధంతరంగా రద్దు కావడంతో టీమిండియా ప్రపంచకప్ సన్నాహకాలకు కాస్త ఇబ్బంది తలెత్తినా... బీసీసీఐ యుద్ధ ప్రతిపాదికన లంకతో సిరీస్ను ఏర్పాటు చేసి వాటిని తొలగించింది. ఈ నేపథ్యంలో నేడు బారాబతి స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కఠినమైన ఆసీస్ పర్యటనకు ముందు ఈ సిరీస్ను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తుంటే.... భారత్ను ఓడించడం ద్వారా జట్టులో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని లంక ప్రయత్నాలు చేస్తోంది.
తుది కూర్పు ఎలా?
రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించుకునేందుకు భారత్ ఈ సిరీస్ను ఓ వేదికగా తీసుకోనుంది. అయితే ఈ సిరీస్లో రాణించడం ద్వారా సెలక్టర్ల దృష్టిలో పడాలని యువ ఆటగాళ్లు కోరుకుంటున్నారు. రెగ్యులర్ కెప్టెన్ ధోనికి విశ్రాంతి ఇవ్వడంతో విరాట్ కోహ్లి జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఓపెనర్లుగా ధావన్, రహానే బరిలోకి దిగుతారు. ఇంగ్లండ్ టూర్లో ఘోర వైఫల్యం తర్వాత విండీస్తో సిరీస్లో ఫామ్లోకి వచ్చిన విరాట్ ఈ సిరీస్లోనూ ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. ఇప్పటికే భవిష్యత్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న ఈ ఢిల్లీ స్టార్కు ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. రైనా సూపర్ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం.
గాయం నుంచి కోలుకున్న బెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు తెలుగు తేజం అంబటి రాయుడుకు ఈ సిరీస్ గొప్ప అవకాశం. ఈ ఇద్దరూ సత్తా చాటకపోతే భవిష్యత్లో సెలక్టర్ల దృష్టిలో పడటం కష్టం. జడేజా ఆల్రౌండర్గా ఆకట్టుకుంటున్నాడు. ఇక బౌలింగ్లో ఉమేశ్, వరుణ్ ఆరోన్లు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇషాంత్పై అధిక భారం పడనుంది. భువనేశ్వర్, షమీల లోటును ఈ ఇద్దరు పూరించగలిగితే భారత్కు మరో రెండు ప్రత్యామ్నాయాలు లభించినట్లే. స్పిన్నర్ అశ్విన్ తుది జట్టులోకి వస్తే మిశ్రా, అక్షర్ పటేల్ బెంచ్కు పరిమితం కావలసిందే. మురళీ విజయ్, ధావల్ కులకర్ణిలకు కూడా తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమే.
బౌలింగ్ బలహీనం
మరోవైపు సీనియర్లు సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్లతో లంక బ్యాటింగ్ బలోపేతంగా కనిపిస్తోంది. కుశాల్ పెరీరా, తరంగ కూడా తమ వంతు పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. పటిష్టమైన భారత్పై ఆడితే సులభంగా వరల్డ్కప్ బెర్త్ దక్కించుకోవచ్చని జట్టులోని యువ ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. అయితే మలింగ, హెరాత్ల గైర్హాజరీతో లంకేయుల బౌలింగ్ బలహీనంగా మారింది. కులశేఖర, ప్రసన్న, చతురంగ, రణ్దీవ్ల బృందం ఈ టూర్లో భారత్ను ఏ మేరకు నిలువరిస్తుందన్నది సందేహంగా మారింది. అయితే అటు కెప్టెన్ మ్యాథ్యూస్, ఇటు కోచ్ ఆటపట్టు ఈ సిరీస్లో తమ జట్టు ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నారు.
జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, రాయుడు, రైనా, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, ఆరోన్.
శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), తరంగ, దిల్షాన్, సంగక్కర, జయవర్ధనే, ప్రియాంజన్, తిసారా పెరీరా, ప్రసన్న, దమ్మిక ప్రసాద్, కులశేఖర, రణ్దీవ్ / లాహిర్ గమగే.
200 రైనాకు ఈ మ్యాచ్ రెండొందలవది. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 12వ క్రికెటర్.
పిచ్ బ్యాటింగ్ వికెట్. పరుగుల వరద ఖాయమని క్యురేటర్ అభిప్రాయం. 280 నుంచి 300 మంచి స్కోరు. అయితే రాత్రి మంచు ప్రభావం ఉండొచ్చు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం.
వాతావరణం వర్షం పడే అవకాశాల్లేవు. కాబట్టి మ్యాచ్కు ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చు.
‘రాబోయే కొన్ని నెలలో జట్టులో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే ప్రపంచకప్కు జట్టులో సరైన మేళవింపును ఈ సిరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. మెగా ఈవెంట్ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు బాగా ఆడాలని కోరుకుంటారు. కాబట్టి ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచకప్కు ముందు ఎక్కువ మ్యాచ్లు లేకపోవడంతో ఈ సిరీస్ కూడా కీలకం కానుంది. జట్టుకు కెప్టెన్గా ఉండేందుకు ఇష్టపడతా. టెక్నిక్ పరంగా నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను. మానసికంగా నేను చాలా దృఢంగా ఉన్నాను’ - కోహ్లి (భారత కెప్టెన్)