ప్లే ఆఫ్స్‌కు దబంగ్‌ ఢిల్లీ | Dabang Return To Top Of The Table After win Over Patna | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్స్‌కు దబంగ్‌ ఢిల్లీ

Sep 27 2019 9:59 AM | Updated on Sep 27 2019 9:59 AM

Dabang Return To Top Of The Table After win Over Patna - Sakshi

జైపూర్‌: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్‌ ప్లేఆఫ్స్‌కు దబంగ్‌ ఢిల్లీ అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 43–39తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. పట్నా రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ (19 పాయింట్లు) పోరాటం మరో సారి వృథాగా మిగిలింది. ఢిల్లీ రైడర్‌లు విజయ్‌ (13 పాయింట్లు), నవీన్‌ కుమార్‌ (11 పాయింట్లు) జట్టుకు విజయం అందించారు. ఇరు జట్ల రైడర్లు సమానంగా పాయింట్లు తీసుకురావడంతో తొలి అర్ధభాగం 13–13తో ముగిసింది.

రెండో అర్ధభాగంలో తొలి రైడ్‌కు వెళ్లిన ప్రదీప్‌ నర్వాల్‌ను ఢిల్లీ సూపర్‌ ట్యాకిల్‌ చేసింది ఆ వెంటనే ఢిల్లీకి కౌంటర్‌ ఇస్తూ జాంగ్‌ కున్‌ లీ రెండు పాయింట్ల రైడ్‌ చేయడంతో మరోసారి స్కోర్‌ 15–15తో సమం అయింది. 28వ నిమిషంలో ప్రదీప్‌ సూపర్‌ రైడ్‌ చేయడంతో పట్నా 25–20తో ఆధిక్యంలోకెళ్లింది. ఈ దశలో ఢిల్లీని నవీన్‌ కుమార్, విజయ్‌లు ఆదుకున్నారు. ఆట మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా విజయ్‌ సూపర్‌ రైడ్‌తో ఢిల్లీకి నాలుగు పాయింట్లు సాధించి పెట్టాడు. ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించిన ఢిల్లీ విజేతగా నిలిచింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement