
49 పరుగులు.. ఎనిమిది వికెట్లు!
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో విలవిల్లాడింది.
మిర్పూర్:ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో విలవిల్లాడింది. శుక్రవారం తొలి రోజు ఆటలో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ కు ఆదిలో శుభారంభం లభించినా.. వరుసగా వికెట్లను కోల్పోయి 63.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆటలో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 118 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిన బంగ్లా.. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. బంగ్లా ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్(104), మోమినుల్ హక్యూ(66) పరుగులతో రాణించినా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ప్రధానంగా 171 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయిన బంగ్లా.. మరో 49 పరుగులు వ్యవధిలో మిగతా వికెట్లను కోల్పోయింది.
బంగ్లాదేశ్ తన చివరి ఐదు వికెట్లను 19 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో ఆశించిన స్కోరును సాధించలేకపోయింది. ఏడుగురు బంగ్లా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అలీ తన స్పిన్ మ్యాజిక్తో బంగ్లా ఇన్నింగ్స్ను కకావికలం చేశాడు. అలీ ఐదు వికెట్లతో రాణించి బంగ్లా పతనాన్ని శాసించగా, వోక్స్కు మూడు వికెట్లు, బెన్ స్టోక్స్కు రెండు వికెట్లు లభించాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.