‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’

YSRCP Leader Vijayasai Reddy Tweets On Lagadapati Survey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లగడపాటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేను నమ్మి ఎగ్జయిట్‌ అయిన తెలుగు తమ్ముళ్లు ఈ నెల 23న తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు. రాజగోపాల్‌ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్‌ఏ డామినేట్‌ చేసింది’  అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. 

ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటో
తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పొరుగున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేెెెమిటని ప్రశ్నించారు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడిపోవాలో చంద్రబాబు కంటే వాళ్లకే ( ఉత్తరాది నేతలు, కాంగ్రెస్‌ నాయకులు) బాగా తెలుసని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

బాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారట
ప్రస్తుతం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను, వీళ్లను కలుపుతా అంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇది చూసిన ఢీల్లీ నేతలు చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట’  అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

మరో ట్విట్‌లో ‘యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

సొంత రాష్ట్రంలో గెలిచే సీన్‌ లేక ఢిల్లీ తిరుగుతున్నారు
సొంత రాష్ట్రంలో గెలిచే సీన్‌ లేక సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, లక్నోలో తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్డీయేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే చంద్రబాబు ఐక్యత చర్చలంటూ తిరుగుతున్నారని విమర్శించారు.‘ ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్‌ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట’ అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top