
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఈనెల 29 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి వైఎస్ విజయమ్మ గురువారం నివాళులు అర్పించనున్నారు. 29న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
30న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లోనూ.. 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ విజయమ్మ ప్రచారం చేస్తారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 30న గూంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ.. 31న గంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోనూ ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారు.