‘తాళపత్రాలు విడుదల చేసినా.. మిమ్మల్ని నమ్మరు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రజా సమస్యల కంటే తన వ్యక్తిగత సమస్యల గురించే ఎక్కువ ఆందోళన ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే కరకట్ట నివాసం, బినామీ ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంపైనే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు శ్వేతపత్రాల పేరుతో 10 బోగస్ పత్రాలు వదిలినా ఘోర పరాజయం తప్పలేదన్నారు. చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
‘ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేత పత్రాల పేరుతో 10 బోగస్ పత్రాలు వదిలారు. అయినా ఘోర పరాజయం తప్పలేదు. ఇప్పుడు అమరావతి, పోలవరం, అంచనాలు పెంచిన ప్రాజెక్టులపై వాస్తవ పత్రాలు బయట పెడతారట. తాళపత్రాలు విడుదల చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.