టీటీడీపీ మేనిఫెస్టో ఇదే

Telangana TDP Manifesto Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా మహాకూటమిలో భాగమైన తెలంగాణ టీడీపీ తమ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ మేనిఫెస్టోను ప్రకటించారు.  ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని, ప్రగతి భవన్‌ను ప్రజాస్పత్రిగా మారుస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ మేనిఫేస్టో రూపకల్పనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా టీడీపీ నేతలు తెలిపారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అంశాలను పరిగణనలోకి తీసుకుని మేనిఫేస్టో రూపొందించామని వెల్లడించారు.
   
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు

  •  రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ, దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం, ఇంటర్ నుంచే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి. అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, వారి సంక్షేమానికి ప్రాధాన్యత.
  • అన్ని జిల్లాల్లో పూలే, అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు, హైద్‌రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ, లోకాయుక్త ఏర్పాటు, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి
  • బెల్ట్ షాపుల రద్దు, విద్యారంగానికి బడ్జెట్‌లో అదనంగా రూ.5వేల కోట్లు కేటాయింపు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు, ప్రొఫెసర్ జయశంకర్ పేరిటి విద్యా సంస్థలు ఏర్పాటు
  • పేద యువతుల వివాహానికి రూ.1.50 లక్షల ఆర్థికసాయం, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు.
  • 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దివ్యాంగులకు రూ.3వేలు పించన్.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top