నేడు పరిషత్‌ నోటిఫికేషన్‌

Telangana MPTC And Elections Notification Is Coming - Sakshi

కరీంనగర్‌: జిల్లా, మండల ప్రజాపరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వెనువెంటనే నామినేషన్ల స్వీకరించనున్నారు. మొదటి విడత ఎన్నికలు ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక, మానకొండూర్‌ మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలతోపాటు 89 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 22న ఆయా మండలాల పరిధిలో రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అప్పీలు, 28న నామినేషన్ల ఉపసంహరణ, 28న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

మండల కేంద్రాల్లోనే నామినేషన్లు...
అన్ని మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్‌ అధికారి చొప్పున 15 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను నియమించారు. మరో ముగ్గురు రిటర్నింగ్‌ అధికారులను రిజర్వ్‌లో ఉంచనున్నారు. ప్రతీ మూడు ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మొత్తం 60 క్లస్టర్లనుఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారికి సహాయకులుగా ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు కేటాయించిన రిటర్నింగ్‌ అధికారులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చాన్స్‌...
ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్లు సమర్పించే విధానం అందుబాటులోకి వచ్చింది. నామినేషన్‌ పత్రాల కోసం రిటర్నింగ్‌ అధికారుల వద్ద వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో క్యాండిడెట్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలు అప్షనల్‌ ఉంటాయి. వాటిలో ఆన్‌లైన్‌ నామినేషన్‌ ఫర్‌ రూరల్‌ బాడీస్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జెడ్పీటీసీ స్థానానికి ఆన్‌లైన్‌ నామినేషన్‌ సమర్పించేందుకు ఆప్షన్‌ చూపిస్తుంది. ఏ అభ్యర్థి ఏ పదవీకి పోటీ చేస్తున్నారో దానిని ఎంచుకోని ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలి. అప్‌లోడ్‌ చేసిన తరువాత ఆ కాపీని ప్రింట్‌ తీసుకుని కచ్చితంగా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్‌ సబ్‌మిషన్‌ నామినేషన్‌ పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది.

జెడ్పీటీసీకి రూ.5 వేలు, ఎంపీటీసీకి రూ.2,500...
పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు డిపాజిట్లు మొదలుకుని వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. జనరల్‌ జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5 వేలు, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే వారు రూ. 2,500 డిపాజిట్‌ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌కు కేటాయించిన జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500, ఎంపీటీసీ అభ్యర్థులు రూ. 1250 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. పరిషత్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే నిర్వహించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top