మోదీ ప్రకటనతో మళ్లీ ఉద్యమం: అంబటి

TDP BJP Acting On AP Special Status Issue - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్సార్‌ సీపీ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. అవిశ్వాసంపై వైఎస్సార్‌ సీపీ 13 సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టించిన చంద్రబాబు, అవిశ్వాసం పెడితే ఏం వస్తుందని గతంలో మాట్లాడారు. దేశంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టినట్టు చంద్రబాబు హడావుడి చేశారు. చివరికి ఏం జరిగింది ఏ పార్టీ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని ప్రధాని మోదీ చెప్పడం దారుణం. ఈ రోజు ప్రత్యేక హోదా నినాదం ఈ స్థాయికి చేరిందంటే అది వైఎస్సార్‌ సీపీ పోరాటం వల్లనే.

ముందే ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు.. హోదాను సర్వనాశనం చేయాలని మోదీ, చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు అన్నారు. హోదాను తెరిచిన అధ్యాయం చేయడానికి వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌ సీపీ చాలా పోరాటాలు చేస్తోంది. హోదా కోసం చాలా కష్టాలు, నష్టాలు చవిచూశాం. అవిశ్వాసానికి ముందు జాతీయ పార్టీల మద్దతు కోసం చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు. ఇప్పుడు ఎవరి కాళ్లు పట్టుకోవడానికి, ఏం సర్దుబాటు చేయడానికి ఢిల్లీ వెళ్లారు. హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబే.14వ ఆర్థిక సంఘం కోసం ఆనాడే జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున బాబుకు ఇప్పుడు గుర్తొచిందా.

టీడీపీ, బీజేపీల లాలూచీ... ఏపీకి మోదీ, చంద్రబాబు చేసింది ద్రోహం. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది జగన్‌ మాత్రమే. బీజేపీ కుంభకోణాలపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదు. మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, హరిబాబులు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడలేదు. దీనిని బట్టి టీడీపీ, బీజేపీల లాలూచీ అర్ధమవుతోంది. మోదీ, బాబు నాటకాల వల్ల ఏపీని నాశనం చేశారు. మాట తప్పితే మనిషి కాదని గల్లా జయదేవ్‌ చెప్పారు. ఆ మాటలు చంద్రబాబుకు వర్తించవా. కేసీఆర్‌, చంద్రబాబు మధ్య ఏం వ్యవహారాలు సెటిల్‌ చేశారో మోదీ చెప్పాలి. ఓటుకు నోటు కేసును మోదీ ఏం చేశారు. హోదాపై మోదీ ప్రకటనతో మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే బంద్‌కు పిలుపునిచ్చాం’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top