‘అలా అయితే ముఖ్యమంత్రి ఎందుకు?’
సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్ర ఎన్నికల అధికారి పరిపాలనలో జోక్యం చేసుకుంటే ముఖ్యమంత్రి ఎందుకని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంటిసాకులతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరును ప్రజలంతా తప్పుబడుతున్నారన్నారు. ఎన్నికలు నిర్వహించే విధి మాత్రమే ఈసీకి ఉంటుందని, ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఏ కలెక్టర్ ఎక్కడ ఉండాలో ఈసీ ఎలా నిర్ణయిస్తుందని, ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యం అవ్వడం వలన ఎన్నికలు ఆలస్యం అయ్యాయన్నారు. ( అందుకే ఆయన సేవలో..! )
రాజ్యాంగబద్ద వ్యవస్థలు ప్రభావితం చేయబడుతున్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, విధివిధానాలు అమలుచేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని చెప్పారు. జాతీయ విపత్తులు ఏర్పడితే ప్రభుత్వ యంత్రాంగం సూచనల మేర నిర్ణయం ప్రకటించాలన్నారు. ‘ఇది కరోనా వైరసా.. కమ్మోనా వైరాసా!!..’ అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధని, పాలనలో జోక్యం చేసుకోకూడదని అన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థల్లో కుట్రదారులు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ప్రజల మధ్యకు వెళ్లాలని, కుట్రలు చేయకూడదని హితవు పలికారు. ( ఎన్నికల వాయిదా; తెర వెనుక ఏం జరిగింది?! )