
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేందుకు, కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. 40 రోజుల పాటు రోజుకు 3 నియోజకవర్గాల్లో యాత్ర చేపడతామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పర్యటించి.. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళతామని చెప్పారు. టీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, దాని నుంచి బయటపడటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ సోమవారం గాంధీభవన్లో ఇష్టాగోష్టిగా మీడియాతో మాట్లాడారు. సమష్టి కృషితో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత
టీఆర్ఎస్లో ఎక్కువ చెత్త నిండిపోయిందని, కేసీఆర్ పనితీరు బాగాలేదని ప్రజల్లో అభిప్రా యం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్తో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్లోకి ఎవరు వచ్చినా షరతులు లేకుండానే చేరుతున్నారని.. తమతో మాట్లాడుతున్న నాయకులకు కూడా ఇదే విషయం చెబుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా, ఎవరు మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయం తెలుస్తోందన్నారు.
నెలాఖరులో టీపీసీసీ, డీసీసీల పునర్వ్యవస్థీకరణ
టీపీసీసీ, డీసీసీల పునర్వ్యవస్థీకరణను ఈ నెలాఖరులో చేపడతామని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ ఏర్పాటు ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం కమిటీలో ఉన్న కొందరు పనిచేయడానికి ఇష్టపడటం లేదని, పార్టీలో మరికొందరు పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. పనిచేసేవారికి అవకాశాలు ఇస్తామని, పనిచేయలేని వారిని తొలగిస్తామని వెల్లడించారు. టీపీసీసీలో పాత జిల్లా యూనిట్గా జిల్లాకు ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 12 మంది కార్యదర్శులకు అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలోకి, ఏఐసీసీలోకి రాష్ట్రం నుంచి పలువురికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. వాటితోపాటు ఎన్నికల ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను కూడా ప్రకటిస్తారని వెల్లడించారు.
రాహుల్తో ప్రత్యేక సమావేశాలు
పార్టీపరంగా కార్యాచరణ ప్రణాళికపై భేటీ అయ్యేందుకు రాహుల్గాంధీ ఈ నెలాఖరులో సమయం ఇచ్చారని ఉత్తమ్ వెల్లడించారు. అయితే తాము మేడారం సమ్మక్క–సారక్క ఆలయానికి వెళ్లాలని అనుకుంటున్నామని.. అందువల్ల దానికన్నా ముందో, తర్వాతో భేటీ ఉండేలా యోచిస్తున్నామని తెలిపారు.
ఇసుక మాఫియా ఆగడాలు కనిపించడం లేదా?
సూటు బూటు వేసుకుని ఇవాంకాతో తిరగడం తప్ప మంత్రి కేటీఆర్కు రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు, హత్యలు కనిపించవా అని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ ఢీకొని మరణించిన సాయిలు కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం గాంధీభవన్లో ఉత్తమ్ను కలిశారు. వంతుల వారీగా సాయిలు వీఆర్ఏగా పనిచేస్తున్నాడంటూ.. సంబంధిత గుర్తింపు బిళ్ల, హాజరు పట్టికను వారు ఉత్తమ్కు, మీడియాకు చూపించారు. తమను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దులేకుండా పోయిందని ఈ సందర్భంగా ఉత్తమ్ మండిపడ్డారు.
ఆదుకోవాల్సిన ప్రభుత్వం, పోలీసులు, అధికారులతోపాటు గవర్నర్ కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు మద్దతు పలికేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సాయిలు వీఆర్ఏ కాదంటూ గవర్నర్ కూడా మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారు కుమ్మక్కైతే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. సాయిలు మరణానికి కారణమైన ట్రాక్టర్ యాజమానిపై హత్య కేసు నమోదు చేయాలని.. సాయిలు కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియాలో సభ నిర్వహిస్తాం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సభకు అనుమతి అడుగుతున్నామని, ఇస్తే బహిరంగ సభ నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు. సర్పంచ్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలే మంచిదని, పరోక్ష ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉండకపోవచ్చని చెప్పారు. పునర్విభజన కోసం టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోందని, దానిపై పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి టీపీసీసీ అధ్యక్షులను కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. పలువురు పార్టీ నేతలు ఉత్తమ్కు శాలువాలు కప్పి సన్మానించారు. గాంధీభవన్లో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.
మహిళలు లేని కేబినెట్ ఇదొక్కటే..
దేశంలో మహిళా మంత్రులు లేకుండా కొనసాగుతున్న కేబినెట్ తెలంగాణ ఒక్కటేనని ఉత్తమ్ విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణలతో కలసి గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. మహిళలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఈ సందర్భంగా ఉత్తమ్ పేర్కొన్నారు. 15 రోజుల్లోగా మహిళా కాంగ్రెస్ కమిటీలను పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళా సాధికారతపై టీఆర్ఎస్ మాట్లాడేది ఎక్కువని, చేసేది తక్కువని మండిపడ్డారు.