‘మిషన్‌ భగీరథే ఆ కుటుంబానికి బతుకుదెరువు’ | Madhu Yashki Slams MP Kavitha, Minister Pocharam | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ భగీరథే ఆ కుటుంబానికి బతుకుదెరువు’

Aug 6 2018 6:08 PM | Updated on Aug 9 2018 4:51 PM

Madhu Yashki Slams MP Kavitha, Minister Pocharam - Sakshi

మధు యాష్కి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : ‘మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారింది.. అందుకే రైతుల పొలాలను ఎండబెట్టి మరి ఈ ప్రాజెక్ట్‌కు నీటిని కేటాయిస్తున్నార’ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు.

ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా కాకతీయ కెనాల్‌ కింద కోరుట్ల, బాల్కొండ పరిధిలోని 20కి పైగా గ్రామాల ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. ఎగువన ఎస్సారెస్పీలో 16 టీఎంసీల నీరున్నా.. రైతుల పొలాలకు నీళ్లు వదలకుండా, ప్రభుత్వం కావాలనే వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

నీళ్ల కోసం రైతులు ఆందోళన చేయకుండా ఉండేందుకు ఇప్పటికే ఎస్సారెస్పీ పరిసర గ్రామాల్లో భారీగా పోలీసుల బలగాలను మోహరించి, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు . కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలైనా గజ్వేల్‌, సిద్ధిపేటకు నీటిని వదలడం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై వ్యవసాయ మంత్రి పోచారం, కోరుట్ల స్థానిక మంత్రి కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావ్‌, ఎంపీ కవిత స్పందించాలని డిమాండ్‌ చేశారు.

రైతులు కోరుకున్నది కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే..  కానీ ప్రభుత్వం మాత్రం రైతుల గోడును పట్టించుకోకుండా ఆ నీటిని మిషన్‌ భగీరథకు తరలిస్తుందన్నారు. కారణం ఈ ప్రాజెక్ట్‌ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారిందని ఆరోపించారు. తక్షణమే రైతులకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement