పల్లకీ మోసే కూలీలు కావొద్దు: కృష్ణయ్య
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని, ఇష్టం వచ్చినట్లు ఓటు వేసి పల్లకీ మోసే కూలీలు కావొద్దని విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. శుక్రవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ బీసీ సంఘం ఆవిర్భావ సభ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులంతా ఏకమై ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లల్లో అమలవుతున్న బీసీ క్రీమీలేయర్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక పాలసీలో బీసీలకు 50శాతం కోటాతో పాటు రూ.20వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.