కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా? | Kerala Slams Centre For Trains Sent Without Information | Sakshi
Sakshi News home page

మహమ్మారి కాలంలో రైల్వేస్‌ అరాచకం: కేరళ

May 27 2020 1:18 PM | Updated on May 27 2020 1:34 PM

Kerala Slams Centre For Trains Sent Without Information - Sakshi

తిరువనంతపురం : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు కేంద్ర ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్ల నిర్వహణపై కేరళ ప్రభుత్వం అభ్యతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రామిక రైళ్ల విషయంలో వలస కార్మికులను తరలించేందుకు సరిపడా రైళ్లను సమకూర్చడం లేదని మహారాష్ట్ర కేంద్రంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా కేరళ స్పందిస్తూ.. ముందస్తు సమాచారం లేకుండానే రాష్ట్రంలోకి రైళ్లను పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ద్వారా కరోనా వైరస్‌ నియంత్రణకు పాటిస్తున్న ప్రోటోకాల్‌ దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో కరోనా వైరస్‌కు కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మార్చాలని రైల్వే వ్యవస్థ కోరుకుంటోందని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆరోపించారు. (మటన్‌ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు)

ఈ మేరకు ఆయన.. ‘గత వారం ముంబై నుంచి రైలు వచ్చింది. రైలు ప్రారంభమయ్యాక దాని గురించి మాకు సమాచారం ఇచ్చారు. షెడ్యూల్‌లోని లేని స్టాప్‌లో ఆపారు. ప్రయాణీకుల్లో ఎక్కువ మందికి పాస్‌లు లేవు. మహమ్మారి కాలంలో రైల్వే ఆరాచకంగా చేస్తోంది. కేరళలో సూపర్‌ స్ర్పైడర్‌ అవ్వాలని రైల్వే కోరుకుంటుంది. ఇలా చేయడం మాని బాధ్యతగా వ్యవహరించండి. కనీసం రైళ్లను ట్రాక్ చేయడానికైనా ప్రయత్నంచండి’ అని థామస్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని, ఈ విషయం గురించి జాతీయ మీడియా సైతం ప్రస్తావించారని అన్నారు. ముంబై నుంచి కేరళకు చేరుకున్న రైలు గురించి అసలు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. (వారి భవిష్యత్‌కు నా పెట్టుబడి : సీఎం జగన్‌)

వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి రావడంపై తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అయితే దీనిపై ముందస్తు సమాచారం అందించాలని కోరారు. తమకు సమాచారం ఇవ్వకుండానే ముంబై నుంచి రైలు వచ్చిందన్నారు. దీని గురించి రైల్వే మంత్రితో చర్చించామని అయినప్పటికీ చెప్పకుండానే మరో రైలు కేరళకు వచ్చిందన్నారు. కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్య గురించి  ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఇక రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 895 కి చేరింది. వీరిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన 72 మంది, తమిళనాడు నుంచని వచ్చిన 71 మంది, కర్ణాటక నుంచి వచ్చిన 35 మంది ఉన్నారు. మంగళవారం కేరళలో  67 కొత్త కేసులు నమోదయ్యాయి. (కేర‌ళ ఆఫ‌ర్‌కు ఓకే చెప్పిన 'మ‌హా' స‌ర్కార్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement