28 ఏళ్ల బచ్చాను.. నితీశ్ దుమ్ము దులిపా!

I Am 28 But We Won By Polls, Says Tejashwi Yadav - Sakshi

ఎన్నికల ఛాలెంజ్‌ను గుర్తుచేసిన తేజస్వీ యాదవ్

విజయోత్సవాలు చేసుకునే తీరిక లేదు

ఎన్డీఏ నుంచి ఎప్పుడు వైదొలగుతారు

సీఎం నితీశ్‌కు మాజీ మంత్రి తేజస్వీ సూటిప్రశ్న

సాక్షి, పట్నా: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ సొంతం చేసుకుంది. ఓ స్థానంలో మాత్రం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు తాను ఏం చెప్పానో గుర్తుచేసుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ సూచించారు. ఉప ఎన్నికల విజయాన్ని ఆస్వాదించే సమయం తన వద్ద లేదని రైతులు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు తేజస్వీ.

తాను 28 ఏళ్ల బచ్చానని, చాచా(నితీశ్) మీరు 67 ఏళ్ల వ్యక్తి అయినా ఎన్నికల్లో సత్తా చాటి చూపిస్తానని సీఎం నితీశ్‌కు వారం రోజుల ముందే చెప్పానన్నారు తేజస్వీ. బిహార్ మాజీ సీఎం, తేజస్వీ తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన తర్వాత జరిగే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ వెనుకంజ వేస్తున్నారని ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ బిహార్ రైతులకిచ్చిన ఇచ్చిన హామీల అమలుపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఎన్డీయేతర పార్టీల సీనియర్ నేతలు చర్చించుకుని 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు రచించాలని లాలు తనయుడు ఆకాంక్షించారు.  

'ఎన్డీఏ కూటమి నుంచి నేడు టీడీపీ వైదొలగింది. నితీశ్ ఇంకా ఏం విషయం తేల్చుకోలేక పోతున్నారు. మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్ తప్పిదం చేశారు. టీడీపీ బాటలో పయనించి మీరు ఎన్డీఏ నుంచి ఎప్పుడు బయటకొస్తారో చెప్పాలంటూ' నితీశ్‌ను తేజస్వీ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై కామెంట్ చేసేంతే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top