ఉద్యోగాల భర్తీని మరచిన కేసీఆర్‌ : శ్రీకాంత్‌ రెడ్డి | Gattu Srikanth Reddy Slams TRS Government On Notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల భర్తీని మరచిన కేసీఆర్‌ : శ్రీకాంత్‌ రెడ్డి

Aug 2 2018 1:26 PM | Updated on Aug 20 2018 6:07 PM

Gattu Srikanth Reddy Slams TRS Government On Notifications - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ సర్కారు ఖాళీల భర్తీని విస్మరించిందని తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్సార్‌ సీపీ నాయకులు ధర్నాలు చేపట్టారు.

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ఉద్యోగ ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. మూడు నెలల్లోగా ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

జిల్లాల్లో ఇలా..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ  ధర్నా జరిగింది. ఈ మేరకు డీఆర్వో మోహన్ లాల్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు నాడేమ్ శాంత కుమార్, భూపాలపల్లి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు అప్పమ్ కిషన్, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రామకృష్ణ, వైఎస్సార్‌ సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ పట్టణంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కలక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏవో పి.సురేష్ బాబుకి వినతిపత్రం అందజేశారు.

కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

ఖమ్మం జిల్లా : జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నందు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా వైఎస్సార్‌ సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు విచ్చేశారు.

పెద్దపల్లి జిల్లా : ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పెద్దపల్లిలో కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్సీపి జిల్లా అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా : లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిరిసిల్లలో కలెక్టరేట్ ముందు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు రామ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement