‘బీజేపీతో పొత్తా?.. వెలేస్తా’ | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 1:06 PM

Deve Gowda Warns Kumaraswamy over Ties with BJP - Sakshi

సాక్షి, బెంగళూరు: జనతా దళ్‌(సెక్యులర్‌) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ.. తనయుడు కుమార్‌స్వామికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీతో పొత్తు లాంటి ప్రయత్నం చేస్తే కొడుకని కూడా చూడకుండా కుమారస్వామిని వెలేస్తానని ప్రకటించారు. సోమవారం తన నివాసంలో ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు దేవెగౌడ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

బీజేపీతో కుమారస్వామి పొత్తు అంశం గురించి జర్నలిస్ట్‌ ప్రస్తావించగా... ‘ఒకవేళ అలాంటిదే జరిగితే  నేను, నా భార్య, నా కుటుంబమే కుమార స్వామిని వెలిస్తుంది. గతంలోనే  అతను (కుమారస్వామి) తప్పు చేశాడు. వ్యక్తిగతంగా నష్టపోవటంతోపాటు పార్టీని కొలుకోలేని దెబ్బతీశాడు. మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేస్తానంటే ఎలా ఊరుకుంటా?. పార్టీలోంచే కాదు, ఇంట్లో కూడా అతనికి స్థానం ఉండదు’ అని దేవెగౌడ హెచ్చరించారు. తండ్రి ప్రకటనపై తనయుడు కుమారస్వామి స్పందించారు. ‘ఆయన(దేవెగౌడ) ఆ మాటలు ఏ సందర్భంలో అన్నారో నాకు తెలీదు. కానీ, అలాంటి పరిస్థితి రాదనే నా నమ్మకం. ఖచ్ఛితంగా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని కుమారస్వామి తెలిపారు. కాగా, సర్వే ఫలితాల్లో ‘హంగ్‌’ ఏర్పడొచ్చన్న కథనాలమేర కుమారస్వామి.. బీజేపీతో దోస్తీ వైపు అడుగులు వేస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement