‘కరీంనగర్‌ రా తేల్చుకుందాం’

Congress Leader Ponnam Prabhakar Fire On TRS Working President KTR In Karimnagar - Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా మండిపడ్డారు. గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 16 మంది ఎంపీలను గెలిపించాలన్న కేటీఆర్‌ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ ఎంపీ నంది ఎల్లయ్య కాకుండా... ఇంతకుముందు ఉన్న 15 ఎంపీలతో టీఆర్‌ఎస్‌ సాధించింది ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 15 మంది ఎంపీలతో ఒక్క విభజన హామీ అయినా సాధించారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణా కోసం పొన్నం ప్రభాకర్‌ ఏం చేశాడో కేటీఆర్‌.. నీ తండ్రిని అడగాలని హితవు పలికారు. అమరుల రక్తపు కూడు తింటున్నది కేసీఆర్‌ కుటుంబమేనని దుయ్యబట్టారు.  అమరవీరుల శవాలపై కేటీఆర్‌ పేలాలు ఏరుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

2004లో కాంగ్రెస్‌ భిక్షతోనే కేసీఆర్‌, కరీంనగర్‌ ఎంపీ అయింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. తనపై మాట్లాడే ముందు కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. లక్ష రూపాయల జీతం కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్‌.. నీకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కరీంనగర్‌ రా.. నేనేంటో నీవేంటో తెలుస్తది అంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణా కోసం అప్పటి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హెలికాఫ్టర్‌ను పేలుస్తానని నేనంటే.. కేటీఆర్‌ మాత్రం కిరణ్‌తో పైరవీలు చేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ యువరాజుగా ఫీలవుతున్నావ్‌.. జాగ్రత్త అని సూచించారు. కేసీఆర్‌ అంటేనే అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని ఢిల్లీలో రికార్డు ఉందని ఎద్దేవా చేశారు. అలాగే కేటీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ పొన్నం విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top