లాలు ఇంట్లో దయ్యాలు! 

Bihar CM Nitish Kumar Say Lalu Prasad Yadav Have Left Ghosts In CM House - Sakshi

ఇంటి వెనుకవైపు పెద్దపెద్ద మట్టికుప్పలు, నలువైపులా కాగితపు కవర్లు

  ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న నితీశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారా?

  పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ సీఎం తన అధికార నివాసాన్ని వదిలి వెళ్లేముందు అక్కడ దయ్యాలను వదిలేశారా? తన తరువాత ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ లక్ష్యంగా లాలు ఆ పని చేశారా? అంటే అవుననే అంటున్నారు నితీశ్‌ కుమార్‌. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అనధికార కార్యక్రమంలో ఈ విషయాలను నితీశ్‌ కుమార్‌ పంచుకున్నారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయాక, నితీశ్‌ లాలు కుటుంబం నివాసం ఉన్న 1, అన్నేమార్గ్‌ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టికుప్పలు కనిపించాయని, ఇంటి నలుమూలల్లో కొన్ని కాగితపు కవర్లు కనిపించాయని నితీశ్‌ గుర్తు చేసుకున్నారు. నీ కోసం కొన్ని దయ్యాలను ఆ ఇంట్లో వదిలి వచ్చానని ఆ తరువాత ఒక సందర్భంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌ స్వయంగా నితీశ్‌తో చెప్పారట. అయితే, ఆ మాటలను లాలు తనదైన స్టైల్‌లో సరదాగానే అన్నారని నితీశ్‌ పేర్కొన్నారు. అయితే, నితీశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బిహార్‌లో సంచలనం సృష్టించాయి.  

నితీశ్‌ గతంలో లాలుకు నష్టం కలిగించే ఉద్దేశంతో పట్నాలోని కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని గురువారం ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానందతివారీ ఆరోపించారు. ఆ పూజలు చేసిన పూజారులు ఈ విషయాన్ని లాలుకు చెప్పారని, దాంతో లాలు ఆ ప్రభావం తనపై పడకుండా వేరే పూజలు చేశారని తివారీ వివరించారు. ఈ విషయం తనకు లాలునే చెప్పారన్నారు. కాగా, మూఢనమ్మకాలను, మంత్రతంత్రాలను లాలు విశ్వసిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో నితీశ్‌కు అలాంటి నమ్మకాలేవీ లేవని ప్రచారముంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top