అసదుద్దీన్ మరో వివాదం
హైదరాబాద్: ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరో వివాదానికి తెర తీశారు. సంజువాన్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవానులకు మతం రంగు పులిమే ప్రయత్నం చేశారు. ముష్కరుల చేతిలో హతమైన ఏడుగురు సైనికుల్లో ఐదుగురు ముస్లింలు ఉన్నారని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ సంజువాన్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన ఖండించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముస్లింల జాతీయతను సోకాల్డ్ జాతీయవాదులు పదేపదే ప్రశ్నిస్తుంటారు. సంజువాన్ ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన ఏడుగురిలో ఐదుగురు కశ్మీరీ ముస్లింలు ఉన్నారు. దేశం పట్ల మాకున్న చిత్తశుద్ధి, ప్రేమను ప్రశ్నించేవారందరికీ ఈ ఉదంతం కనువిప్పు కావాలి. దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నా పాకిస్తానీయులు అంటూ ముద్ర వేస్తున్నారు. దేశం పట్ల విధేయతను రుజువు చేసుకోవాలని ఇప్పటికీ ముస్లింలను అడుగుతున్నార’ని అసదుద్దీన్ అన్నారు.
ఉగ్రవాద దాడులను అరికట్టడంతో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదని దుయ్యబట్టారు.