ఉరితాడుకు కాస్త కారుణ్యం...! | criminals getting relief from death penalty | Sakshi
Sakshi News home page

ఉరితాడుకు కాస్త కారుణ్యం...!

Jan 23 2014 11:42 PM | Updated on Aug 11 2018 8:54 PM

మరణశిక్షల చుట్టూ చాన్నాళ్లుగా అల్లుకుంటున్న ప్రశ్నలకు ఒక సహేతుకమైన జవాబు లభించింది. అలాంటి శిక్ష పడిన ఖైదీలకు ఉండాల్సిన హక్కులు, వారు పొందగల న్యాయ సహాయం తదితర అంశాలపై ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలకమైన తీర్పు వెలువరించింది.

సంపాదకీయం
 మరణశిక్షల చుట్టూ చాన్నాళ్లుగా అల్లుకుంటున్న ప్రశ్నలకు ఒక సహేతుకమైన జవాబు లభించింది. అలాంటి శిక్ష పడిన ఖైదీలకు ఉండాల్సిన హక్కులు, వారు పొందగల న్యాయ సహాయం తదితర అంశాలపై ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలకమైన తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం జరిగినపక్షంలో అలాంటి ఖైదీలకు విధించిన శిక్షలను యావజ్జీవ శిక్షగా మార్చవచ్చునని స్పష్టం చేసింది. వీరప్పన్ అనుచరులు నలుగురి తోసహా 15 మంది మరణశిక్ష ఖైదీల క్షమాభిక్ష వినతులపై నిర్ణయంలో జరిగిన జాప్యం కారణంగా వారందరి శిక్షనూ యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ తీర్పువల్ల మరణశిక్షకు ఎదురుచూస్తున్న 477 మంది నేరస్తులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అసలు నాగరిక సమాజంలో ఉరిశిక్ష వంటి అత్యంత క్రూరమైన శిక్షలకు తావున్నదా, అలాంటి శిక్షలవల్ల నేరం సమసిపోతుందా అన్నది వేరే చర్చ. కానీ, అంత తీవ్రమైన శిక్ష పడిన ఖైదీల విషయంలో అనుసరించాల్సిన విధానాలపై ఇంత వరకూ స్పష్టత లేదు.
 
  ఉరిశిక్షల రద్దును డిమాండు చేస్తున్న పౌర హక్కుల సంఘాలు అలాంటి ఖైదీల హక్కులకు భంగంవాటిల్లుతున్న తీరును కూడా చాలాకాలంగా ప్రశ్నిస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు అలాంటి ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నదనే చెప్పాలి. క్షమాభిక్ష వినతులపై తుదినిర్ణయంలో జరిగే జాప్యంవల్ల ఆ ఖైదీలు మాత్రమే కాదు... వారి కుటుంబ సభ్యులు ఎంతో క్షోభపడుతున్నారు. శిక్షపడిన వెంటనే అలాంటి ఖైదీని ఏకాంతవాస కారాగారంలో ఉంచుతారు. తోటి మనుషులెవరూ కనబడని అలాంటి స్థితిలో వెనువెంటనే శిక్ష అమలైతే వేరే సంగతి. కానీ, వారు ఏళ్లతరబడి అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తున్నది. పర్యవ సానంగా ఆ ఖైదీలు తీవ్ర మానసిక అస్వస్థతకు లోనవుతున్నారు. పార్లమెంటు పై దాడి కేసు దోషి అఫ్జల్‌గురు తన క్షమాభిక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనీ, ఈ నరకాన్ని ఎదుర్కోవడం తనకు అసాధ్యమవుతున్నదనీ చాలాసార్లు చెప్పాడు. ఎనిమిదేళ్లపాటు కేంద్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. చివరకు నిరుడు ఫిబ్రవరిలో అతనికి మరణశిక్ష అమలుచేసినప్పుడు ఎక్కడలే ని తొందరపాటునూ ప్రదర్శించింది.
 
  ఇంతకూ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడంలో ఎందుకింత జాప్యం చోటుచేసుకుంటున్నది? ఉరిశిక్ష పడిన ఖైదీనుంచి లేదా అతని తరఫువారి నుంచి రాష్ట్రపతిని ఉద్దేశించి వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ తొలుత కేంద్ర హోంమంత్రిత్వశాఖకు వెళ్తుంది. ఆ శాఖ పిటిషన్‌ను పరిశీలించి వివిధ విభాగాలనుంచి ఖైదీకి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుం టుంది. దానికితోడు అతడి నేరాన్ని, శిక్షవిధిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తన అభిప్రాయాన్ని జతచేసి రాష్ట్రపతికి నివేదిస్తుంది. వీటన్నిటినీ చూశాక రాష్ట్రపతి ఆ ఖైదీకి విధించిన మరణశిక్షపై తుదినిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి రాజ్యాంగ పరంగా నిర్దిష్ట కాలపరిమితి లేదు. ఫలితంగా ప్రస్తుత యూపీఏ ప్రభుత్వమైనా, ఇంతక్రితం ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వమైనా ఈ విషయంలో సాచివేత ధోరణిని అవలంబిస్తూవచ్చాయి. రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్షపడినవారు, బియాంత్‌సింగ్ హత్యకేసులో శిక్షపడిన భుల్లర్, వీరప్పన్ అనుచరులు 15 మంది ఏళ్లతరబడి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. నిరుడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ రంగంలోకి వచ్చాక అఫ్జల్ గురు మరణశిక్షను యూపీఏ ప్రభుత్వం ఆదరాబాదరాగా అమలుచేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఏతావాతా మరణశిక్ష ఖైదీల స్థితిగతులు ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటున్నాయి.
 
 ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలనుబట్టి ఇకపై ఇది చెల్లదు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించడానికి ప్రభుత్వ విభాగాలకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేకాదు... అలాంటి ఖైదీలకు జైల్లో న్యాయసహాయం అందించాలి. క్షమాభిక్ష తిరస్కృతి విషయాన్ని ఖైదీ కుటుంబానికి తెలియజేయాలి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడానికీ, శిక్ష అమలుచేయడానికీ మధ్య రెండువారాల వ్యవధి ఉండాలి. ఉరితీయ డానికి ముందు తన కుటుంబాన్ని కలిసే అవకాశం ఖైదీకి ఇవ్వాలి. మరణ శిక్ష పడిన వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మదింపు వేయించాలి. అలాంటి ఖైదీల స్థితిగతులను జైలు సూపరింటెండెంట్ తెలుసుకోవాలి.
 
  ఏమాత్రం తేడా అనిపించినా శిక్ష అమలును ఆపేయాలి. వీటన్నిటికీ తోడు క్షమాభిక్ష వినతిని రాష్ట్రపతి తిరస్కరించడానికి ముందు నేరస్తుడిని ఒంటరిఖైదు చేయడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని 72, 161 అధికరణల ప్రకారం క్షమాభిక్ష కోరే హక్కు ఖైదీకి ఉంటుందని, అది కార్యనిర్వాహకవర్గం ఇష్టాయిష్టాలకు లోబడేది కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. నిర్ణయం తీసుకోవడంలో జరిగే జాప్యం ఖైదీని చిత్రహిం సలకు గురిచేయడంతో సమానమని, ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. జాప్యం కారణంగా మరణశిక్ష రద్దు కోరడం చెల్లుబాటుకాదని నిరుడు ఏప్రిల్‌లో భుల్లర్ కేసు విషయంలో ఇచ్చిన తీర్పును తాజాగా సర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తీసుకున్నట్టయింది. పైగా, ఉగ్రవాద కేసుల్లో మరణశిక్షపడినవారికీ, ఇతర నేరాల్లో మరణశిక్ష పడినవారికీ మధ్య వివక్ష చూపడం సరికాదని పేర్కొంది. ఆ తరహా ఖైదీలందరిపట్లా ఒకే తీరుగా వ్యవహరించాలన్నది. మరణశిక్ష పడిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించే విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. దేశంలో ప్రజాస్వామిక విలువలను పెంపొందించేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement