ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) హర్షం వ్యక్తం చేసింది
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే విభజనపై సీమాంధ్రుల ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ కేంద్ర సెక్రటేరియట్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది.
ఉపాధి అవకాశాలు, నదీజలాల పంపకం, నూతన రాజధాని.. తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని, సీమాంధ్ర ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలని సూచించింది. వాస్తవాలను అర్థం చేసుకుని సీమాంధ్ర ప్రజలు ఆందోళనలను విరమించాలని కోరింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడే ప్రజలంతా సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆశిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు