తుంగభద్ర తీరంలో అరుదైన అతిథులు | Rare guests visits Tungabhadra coast from africa country | Sakshi
Sakshi News home page

తుంగభద్ర తీరంలో అరుదైన అతిథులు

Feb 25 2015 8:55 PM | Updated on Oct 4 2018 5:38 PM

తుంగభద్ర తీరంలో అరుదైన అతిథులు - Sakshi

తుంగభద్ర తీరంలో అరుదైన అతిథులు

బళ్లారి జిల్లా హువినహడగలి నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర నదీ తీరాన ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన విదేశీ వలస పక్షులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

కర్ణాటక (బళ్లారి) : బళ్లారి జిల్లా హువినహడగలి నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర నదీ తీరాన ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన విదేశీ వలస పక్షులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. హువినహడగలి సమీపంలోని బన్నిగోళ గ్రామ పరిసరాల్లోని తుంగభద్ర నదీ పరివాహకంలోని డ్యాం బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో రంగు రంగుల పక్షులు వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. రాజహంస అనే పక్షి గులాబీ, తెలుపు, నలుపు తదితర అందమైన రంగులు కలిగి ఉండటంతో ఎగురుతూ ఉన్నప్పుడు ఎంతో అందంగా కనిపించడంతో వాటిని చూడడానికి పెద్ద ఎత్తున పక్షిప్రేమికులు తరలి వస్తున్నారు.

దాదాపు 15 వేల నుంచి 20 వేలకు పైగా రాజహంస అనే విదేశీ పక్షులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. వేలాది పక్షులు ఒకేసారి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో విహరిస్తుండటంతో ఎంతో చూడముచ్చటగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అందమైన రాజహంస విదేశీ పక్షులు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు రంగురంగుల దృశ్యాలు కనిపిస్తుండటంతో వాటిని చూస్తూ పక్షి ప్రేమికులు తనివి తీరా ఆనందిస్తున్నారు.

ప్రప్రథమంగా వేలాది విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి తరలి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రాజహంస అనే పక్షులు ఆఫ్రికా దేశానికి చెందిన వలస పక్షులు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేటి సరస్సు, ఒడిసా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే సమయంలో అప్పుడప్పుడు కనిపిస్తాయని పలువురు పక్షి ప్రేమికులు తెలిపారు. వేలాది అందమైన రాజహంస పక్షులు తరలి రావడంతో వాటిని కొందరు పట్టుకుని తినడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందువల్ల సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తూ అందమైన పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement