
చర్చలు జరగాలి కానీ దాడులు కాదు: ప్రణబ్
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య వివిధ సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు జరగాలే తప్ప అసహనంతో దాడులు కాదని
కోల్కతా: విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య వివిధ సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు జరగాలే తప్ప అసహనంతో దాడులు కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల్లో వందలకొద్ది ఆలోచనలు వెల్లివిరిసి చర్చలు జరగాలని ఆకాంక్షించారు. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో(ఐఐఎం–సీ) శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
వర్సిటీల్లో విద్యార్థుల మధ్య స్వేచ్ఛగా చర్చలు, వాదోపవాదాలు జరిగేందుకు నెహ్రూ కృషి చేశారనీ, వివాదాలు, ఘర్షణల కోసం కాదన్నారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. భారతదేశం శాంతికాముక దేశమనీ, బుద్ధుని జన్మస్థలమనీ, ఇక్కడ అసహనానికి చోటులేదని తెలిపారు. ప్రపంచ స్థాయిలో పోటీపడడానికి మేనేజ్మెంట్ సంస్థలు బోధనలో వస్తున్న నూతన మార్పుల్ని అందుకోవాలన్నారు.