
న్యూఢిల్లీ/మనీలా: ఫిలిప్పీన్స్తో భారత బంధాలకు తన పర్యటనతో కొత్త శక్తి వస్తుందని తాను విశ్వాసంతో ఉన్నాననీ, ఆసియాన్ దేశాలతో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బంధాలు బలపడతాయని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా–ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్స్లో పర్యటించనున్నారు. ఇండియా–ఆసియాన్తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు.
ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో∙పాల్గొననున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. మోదీతోపాటు ఫిలిప్పీన్స్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని అబే, చైనా ప్రధాని కెకియాంగ్, రష్యా ప్రధాని మెడ్వెడెవ్ తదితర నేతలు రానున్నారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణితో ముందుకు వెళ్తుండటం, ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షలు ఈ సదస్సుల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే వీలుంది.
పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయండి
కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించాలంటే సర్కారీ విధానాలు, పథకాల గురించి క్షేత్రస్థాయిలో మంచిగా ప్రచారం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సహచర మంత్రులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రివర్గ సంఘం సమావేశం తర్వాత ఆయన మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. మోదీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి.