‘నన్ను ఏడిపించారుగా..అందుకే ఇలా’
లక్నో : తనను అకారణంగా వేధిస్తున్నారని ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ ఎన్నికల ప్రచార సభలో గగ్గోలు పెట్టిన క్రమంలో ఆయన ప్రత్యర్థి, బీజేపీ నేత జయప్రద స్పందించారు. ఆజం ఖాన్ కారణంగా మహిళ కంటతడి పెట్టిన ఫలితమే ఇదని ఆమె మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ప్రతిసభలో ఏడుస్తున్నారు. తనను ఆయన మంచి నటినంటూ ఎద్దేవా చేసేవారు..ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని జయప్రద ఆక్షేపించారు. రాంపూర్లో బీజేపీ తరపున ఎంపీగా జయప్రద పోటీచేసిన క్రమంలో ఆమెపై ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ తన రాజకీయ కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నించారని గతంలో జయప్రద ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్ను ఈనెల 5న సిట్ అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. పలు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయని ఆయన వాపోతున్నారు. ఎస్పీ నేత ఆజం ఖాన్పై 80కి పైగా కేసులు నమోదయ్యాయి.