కరోనా: ఇంటర్నెట్ సేవలు బంద్.. ఫేక్న్యూస్!
కోల్కతా: సోషల్ మీడియా విస్త్రృతి పెరిగే కొద్దీ ఫేక్న్యూస్ వరదలా ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకోలేని సందిగ్ధంలో పడేస్తోంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నకిలీ వార్తల ప్రచారం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో మరోసారి కేటుగాళ్లు ఫేక్న్యూస్ బురద జల్లుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బంది సహా మీడియా ప్రతినిధులకు మాత్రమే విధులు నిర్వర్తించే వెసలుబాటు కల్పించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఎప్పటికప్పుడు కరోనా సమచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ను విస్తృతంగా ఉపయోగిస్తూ సేవలు అందిస్తున్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేస్తూ డేటాను వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలో కరోనా అలర్ట్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మార్చి 7 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని.. ఉత్తర బెంగాల్ గ్రామీణాభివృద్ధి సంస్థ తమ నోట్లో పేర్కొన్నట్లు వుయో బ్లాగ్లో రాసుకొచ్చింది. ఈ క్రమంలో ఏబీపీ ఆనంద(బంగ్లా చానల్) మమతా బెనర్జీ ఫొటోతో బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసినట్లుగా మార్ఫింగ్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఆరా తీసిన బూమ్లైవ్ ఫ్యాక్ట్చెక్ ఇదంతా అబద్ధమని తేల్చింది. హౌరాలో జరిగిన సమావేశంలో విద్యా సంస్థల సెలవులు పొడగించాలని మాత్రమే సీఎం నిర్ణయం తీసుకున్నారని.. ఇంటర్నెట్ సేవలపై ఎటువంటి నిషేధం విధంచబోవడం లేదని స్పష్టం చేసింది.