ముసుగు యువతిని గుర్తించిన పోలీసులు

Delhi Police Identify Masked Woman Over JNU Violence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూలో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై పోలీసులు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీసీటీవీ పుటేజీలు, వాట్సప్‌లో వైరల్‌ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ముసుగులు ధరించి హాస్టల్‌లో దాడికి పాల్పడిన ఓ యువతిని ఢిల్లీ క్రైమ్‌ బ్యాచ్‌ పోలీసులు కనిపెట్టారు. వీడియోల ద్వారా సేకరించి ఆధారాల్లో గడల చొక్కా, ముఖానికి లైట్‌బ్లూ స్కార్ప్‌, చేతిలో కర్ర పట్టుకున్న యువతిని ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థినిగా పోలీసులు ధృవీకరించారు. ఈమేరకు వెంటనే తమ ముందుకు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. (ఫలించిన స్టింగ్‌ ఆపరేషన్‌.. విచారణకు ఆదేశం!)

కాగా అంతకుముందే ఆ యువతికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీకి చెందినదిగా ఆమెను పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు అక్షత్‌ ఆవాస్థీ అనే ఏబీవీపీకి చెందిన విద్యార్థి కూడా దాడిలో పాల్గొన్నారని, అతన్నికూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదివారమే నోటీసులు పంపారు. అయితే పోలీసుల విచారణలో ఎలాంటి విషాయాలు బయటపడతాయి అనే దానిపై ఆసక్తినెలకొంది. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఢిల్లీ పోలీసులు ఇదివరకే బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయిషీ ఘోష్‌ కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం. ఆమెను ఈరోజు (సోమవారం) పోలీసులు విచారించనున్నారు. (ఎవరీ ఆయిషీ ఘోష్‌?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top