ఢిల్లీ హింసపై 12న విచారణ | Sakshi
Sakshi News home page

బృందాకారత్‌ పిటిషన్‌పై స్పందించండి

Published Sat, Mar 7 2020 8:13 AM

Delhi High Court Adjourns Petitions on Riots Until March 12 - Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసపై వివిధ వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హింస, విద్వేషపూరిత ప్రసంగాలపై ఢిల్లీ హైకోర్టు మార్చి 12న విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. జస్టిస్‌ డీఎన్‌.పటేల్, జస్టిస్‌ హరిశంకర్‌ల ధర్మాసనం పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో చెలరేగిన హింసపై దాఖలైన అన్ని పిటిషన్‌లపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా, సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఢిల్లీ పోలీసులూ, ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

ఢిల్లీ అల్లర్లకు సంబంధముందన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారి వివరాలను వెల్లడించాలంటూ కారత్‌ కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి శవపరీక్షలను వీడియో రికార్డు చేయాలని సంబంధిత ఆసుపత్రులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా ఢిల్లీ అల్లర్ల వార్తలను ప్రసారం చేసినందుకుగానూ కేరళలోని మీడియా వన్, ఆసియానెట్‌ న్యూస్‌ చానెళ్లను కేంద్రం రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేసింది. (చదవండి: బదిలీపై స్పందించిన జస్టిస్‌ మురళీధర్‌)

Advertisement
Advertisement