డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పైపైకి!
నోయిడా: రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటీఎంల వినియోగం బాగా పెరుగుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆధారపడతారన్నారు. దేశంలో దాదాపు 72 శాతం ప్రజలు 32 ఏళ్లలోపు వారేనని, 2040 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 100 కోట్ల బయోమెట్రిక్ కార్డులు, పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఉన్న దేశం మనదేనని చెప్పారు. 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ ముందుకు పోతుందని, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం సమయంలో మన వృద్ధి రేటు ఒయాసిస్సును తలపిస్తుందని అభిప్రాయపడ్డారు.