‘అధికారంలోకి వస్తే జీఎస్టీని మార్చేస్తాం’
సాక్షి, షిల్లాంగ్ : కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జీఎస్టీ స్వరూపాన్ని మార్చివేస్తామని, దాన్ని సరళతర పన్ను వ్యవస్థగా రూపొందిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సంక్లిష్టతలతో కూడిన జీఎస్టీని తాము అధికారంలోకి వస్తే సరళీకరిస్తామని రాహుల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
గతంలోనూ రాహుల్ పలుమార్లు జీఎస్టీపై కేంద్రాన్ని నిలదీశారు. నూతన పన్ను వ్యవస్థను గబ్బర్సింగ్ ట్యాక్స్తో పోల్చారు. సామాన్యులు, చిన్న వ్యాపారులకు జీఎస్టీ గుదిబండగా అభివర్ణించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగేందుకు మహిళలకు అవకాశం కల్పిస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఎక్కువ మందికి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చేందుకు పెద్దసంఖ్యలో మహిళలు పార్టీలో చేరాలని ఆయన ఆహ్వానించారు.