ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.
మోదీ ఏడాది పాలనపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ అంశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సున్నా మార్కులేనని విమర్శించింది. సొంత బలంతో అధికార పగ్గాలు చేపట్టినా భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం లేదని పేర్కొంది. మోదీ ప్రభుత్వం ఏడాది పాలనపై సోమవారమిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడారు. యూపీఏ పథకాలకే పేర్లు మార్చి మోదీ ప్రభుత్వం తెలివిగా మార్కెటింగ్ చేసుకుందని అన్నారు.
‘గత 12 నెలల్లో గణనీయ ఆర్థిక ప్రగతి ఏమీ లేదు. నిత్యావసరాల ధరలనూ అరికట్టలేకపోయారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశడుతున్న బిల్లులను కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న బీజేపీ విమర్శలను తోసిపుచ్చారు. ఎన్డీఏ పాలనలో స్కామ్లు లేవు కదా అని పేర్కొనగా.. యూపీఏ తొలి మూడేళ్లలోనూ స్కామ్లు లేవన్నారు. మోదీ పాలన ‘వన్ మ్యాన్ షో’లా మారిపోయిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వారణాసిలో విమర్శించారు.