ఎస్పీ అధినేతగా అఖిలేష్‌ | Akhilesh Yadav re-elected as Samajwadi Party chief | Sakshi
Sakshi News home page

ఎస్పీ అధినేతగా అఖిలేష్‌

Oct 5 2017 1:49 PM | Updated on Oct 5 2017 2:35 PM

Akhilesh Yadav re-elected as Samajwadi Party chief

సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సీనియర్‌ నేత రాంగోపాల్‌ యాదవ్‌ గురువారం ప్రకటించారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో అధినేత ఎన్నిక జరిగింది. అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఆయన తెలిపారు. అఖిలేష్‌ యాదవ్‌ నాయత్వంలోనే 2019 లోక్‌సభ, 2022 ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేష్‌ తండ్రి అయిన ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి పదవీకాలం గతంలో మూడేళ్లు ఉండగా.. దానిని పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఐదేళ్లకు పెంచినట్లు రాంగోపాల్‌ యాదవ్‌ తెలిపారు. యూపీ ఎన్నికల సమయంలో ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సమయంలోనే ములాయంను పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఆ స్థానాన్ని అఖిలేష్‌ ఆక్రమించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు.

ఈ కారణం వల్లనే అఖిలేష్‌ యాదవ్‌ స్వయంగా ఆహ్వానించినప్పటికీ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆగ్రా సమావేశానికి రాలేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్వయంగా అఖిలేష్‌ స్పందిస్తూ.. నేతాజీ ’ములాయం‘ నన్ను ఫోన్లోనే ఆశీర్వదించారని చెప్పారు. అలాగే శివపాల్‌ యాదవ్‌ కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించారని ఆయన తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement