పెళ్లి గిఫ్ట్ ప్యాక్లో బాంబు!
భువనేశ్వర్: వివాహం సందర్భంగా వచ్చిన ఓ కానుక.. వరుడు, అతని నాయనమ్మ ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటనలో నవవధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 21న వివాహ విందు సమయంలో నవదంపతులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కానుక వచ్చింది.
ఇంటికొచ్చాక దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తుండగానే అందులోని బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ తీవ్రతకు అక్కడే ఉన్న వరుడి నాయనమ్మ ఘటనాస్థలంలోనే చనిపోగా.. వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రూర్కేలా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వరుడు కన్నుమూయగా.. వధువు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు, సాక్ష్యాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.