వివస్త్రను చేసిన 11 మంది మహిళలకు జైలు
ముంబై: ఓ మహిళను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించిన కేసులో 11 మహిళలు, మరో నిందితుడికి ముంబై కోర్టు రెండేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 2010 జూన్లో ముంబై సెవ్రీ ప్రాంతంలో నిందితులు బాధితురాలిపై దాడి చేసి ఘోరంగా అవమానించారు. అంతకుముందు బాధితురాలి సోదరుడు నాలుగేళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యాడు. నిందితుడి సోదరిపై దాడి చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఓ మహిళపై దాడిచేసి ఆమె మానానికి భంగం కలిగించిన కేసులో మహిళలు శిక్షార్హులుకారని, మగవాళ్లు తప్పుచేస్తేనే శిక్షించాలని సెక్షన్లో ఉందన్న డిఫెన్స్ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. సెక్షన్లో వాడిన 'అతడు' అనే సర్వనామం ఎవరికైనా వర్తిస్తుందని, నేరం చేసినవాళ్లు మహిళలయినా, పురుషులయినా శిక్షార్హులేని న్యాయస్థానం స్పష్టం చేసింది.