కథ చెబుతానంటే ఎవరూ వినలేదు

vishwamitra movie teaser launch - Sakshi

రాజకిరణ్‌

రాజకిరణ్‌ సినిమా పతాకంపై రాజకిర ణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్‌ ఎస్‌. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందితారాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్‌ నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజకిరణ్‌ మాట్లాడుతూ– ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది.

అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇందులో యాడ్‌ చేశాం. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలామంది నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాను. వినటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం చేసి నేనే రాజకిరణ్‌ సినిమా అనే బ్యానర్‌ను పెట్టాను. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే సమయానికి అన్నీ సెట్‌ అయ్యాయి. ఇది హారర్‌ సినిమా కాదు కానీ హారర్‌ టచ్‌ ఉంటుంది. మంచి థ్రిల్లర్‌ మూవీ. డిసెంబర్‌ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. నందితారాజ్‌ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న చిత్రమిది. దర్శకుడు నాకు చెప్పింది చెప్పినట్లు తీశారు.

అశుతోష్‌ రాణాగారితో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్‌ మాట్లాడుతూ– ‘‘రాజకిరణ్‌ రెండేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు, మంచి హిట్‌ పాయింట్‌ అని చెప్పాను. ఓ రోజు ఆయన ఫోన్‌ ‘మీరే మెయిన్‌ లీడ్‌’ అన్నారు. రాజేశ్‌ మెయిన్‌ లీడ్‌ ఏంటి? కొందరు అన్నారు. కానీ మా నిర్మాతలు హిట్‌ సినిమా తీయటమే ధ్యేయంగా నిర్మించారు’’ అన్నారు. విద్యుల్లేఖా రామన్‌ మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’ చిత్రం నుంచి నేను రాజకిరణ్‌ గారికి ఫ్యాన్‌. ఈ సినిమాలో రాజేశ్‌తో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్‌ భండారి, ఎడిటర్‌: ఉపేంద్ర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top